తిరుమలగిరి మార్చి 29 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో 57 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటి వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటు అర్హులైన వారికి ఒకేసారి అప్పటి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. ఆ తరువాత కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు చేయలేదు. దీనితో అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, బీడీ, చేనేత కార్మికులు ఫైలేరియా ,డయాలసిస్ బాధితులు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం 22 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు 57 ఏండ్లు నిండి ఆసరా పెన్షన్లకు అర్హత సాధించిన వారు దాదాపు 30 వేల మంది వృద్ధులు ఉన్నారు. అదే విధంగా వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ,చేనేత, గీత కార్మికులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు.
కార్యాలయాల చుట్టు తిరిగినా ఫలితం లేదు
చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయక పోవటంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవటం లేదు. అదే విధంగా జిల్లాలోని 23 మండలాలు , 5 మున్సిపాలిటీల్లో మొత్తం 1,43,979 మంది వివిధ రకాల పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ పెన్షన్లు అందించాల్సి ఉంది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా 18.096 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రకటించిన 6 వేలు పెన్షన్ అందాల్సిఉంది.
పెన్షన్ల కోసం వికలాంగుల ధర్నా
వికలాంగులు తమకు ప్రభుత్వం పెంచుతామన్న 6 వేల పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లు కూడా అందించాలని కోరుతూ ధర్నాచౌక్ వద్ద ధర్నాలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. వీరికి పెన్షన్లు అందించాలని, వారి సంక్షేమం కోసం కృషి చేయాలని కోరుతూ వారికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు పలికారు.
ఆరుగ్యారంటీల్లో చేయూత
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల్లో భాగంగా చేయూత పెన్షన్లు పెంచుతామని హమీ ఇచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక తమకు పింఛన్లు పెరుగుతాయని ఆశించిన లబ్ధిదారులకు మొండిచేయి చూపించింది. దీనితో లబ్ధిదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవటంతో లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చేయూత పథం కింద వృద్ధాప్య ,వితంతు తదితర పెన్షన్లు రూ. 4 వేలకు, దివ్యాంగుల పెన్షన్లున రూ. 6 వేలకు పెంచుతామని ప్రకటించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కొవొస్తున్నా ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు.