నల్లగొండ ప్రతినిధి, నవంబర్1(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోరుతూ కేసీఆర్ పాల్గొన్న అన్ని ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. పక్షం రోజుల్లో మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల పక్షాన కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అన్నిచోట్లా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్, బీఆర్ఎస్పై తమ అభిమానాన్ని చాటారు. గత నెల 16వ తేదీన భువనగిరి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తొలి ప్రచార సభ విజయవంతమైంది. భువనగిరిలో ప్రశాంతమైన వాతావరణం బీఆర్ఎస్తోనే సాధ్యమైందని, మరోసారి శేఖర్రెడ్డిని గెలిపిస్తే
అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అదే స్ఫూర్తితో 26న మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు జనం భారీగా తరలివచ్చారు. ఉప ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన కేసీఆర్కు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు అభివృద్ధిపై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని, ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక 29న కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. విద్యావేత్త, బీసీ బిడ్డ మల్లయ్యయాదవ్ను గెలిపించుకొని 50-60శాతం ఉన్న బీసీలంతా తమ సత్తా చాటాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తున్నది.
ఇక అదే రోజు తిరుమలగిరిలో జరిగిన తుంగతుర్తి సమరశంఖారావం సభలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్కు మద్దతుగా కేసీఆర్ మాట్లాడారు. పట్టుదల కలిగిన ఎమ్మెల్యే కిశోర్కుమార్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకుంటే నియోజకవర్గం మొత్తానికి దళితబంధు ఇచ్చే బాధ్యత నాది అని కేసీఆర్ ప్రకటించడం విశేషం. తర్వాత ఆలేరులో ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ‘సునీతా నా సొంత బిడ్డ. సొంత బిడ్డ కోరిన కోరికలు తీర్చే బాధ్యత తండ్రిగా నాదే. సునీతను యాదాద్రి శిఖరమంత ఎత్తు ఓట్లతో గెలిపించండి.. ఆలేరును తీర్చిదిద్దే బాధ్యత నాదే’ అని స్పష్టం చేశారు. మంగళవారం సాగర్ ఆయకట్టు పరిధిలోని హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో శానంపూడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కర్రావుకు మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు.
భువనగిరి నుంచి ఆసిఫ్నెహర్ కాల్వ ద్వారా గోదావరి జలాలను పానగల్ ఉదయ సముద్రంలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి పెద్దదేవుల పల్లి రిజర్వాయర్లోకి తరలించే స్కీం రెడీగా ఉందని చెప్పారు. ఇది కావాలంటే బీఆర్ఎస్ను మరొక సారి గెలిపించాలని.. బీఆర్ఎస్తోనే సాగర్ ఆయకట్టులో నీళ్ల బాధకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అదేరోజు సాయంత్రం దేవరకొండలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభకు సామాన్య ప్రజలతో పాటు గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.
త్వరలోనే డిండి ఎత్తిపోతలను పూర్తి చేసి దేవరకొండ, మునుగోడు దారిద్రాన్ని పారదోలుతానని కేసీఆర్ ప్రకటించగా చప్పట్లు మార్మోగాయి. ‘రవీంద్రకుమార్ మంచి ఎమ్మెల్యే… ఇదే పద్ధతిలో 70-80వేల మెజారిటీతో ఆయన్ను గెలిపించాలి’ అని కేసీఆర్ పిలుపునివ్వగా చేతులెత్తి జనం సమ్మతించారు. ఇలా అన్ని సభల్లోనూ కేసీఆర్కు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇక నామినేషన్ల ప్రక్రియ అనంతరం మిగిలిన సూర్యాపేట, నల్లగొండ, నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.