సూర్యాపేట పట్టణ ప్రాంత ప్రజలకు త్వరలో మురుగు నీటి సమస్య నుంచి విముక్తి లభించబోతున్నది.పుల్లారెడ్డి చెరువు వద్ద రూ.118 కోట్లతో చేపడుతున్న మురుగు నీటిని శుద్ధి చేసే కేంద్రం పనులు 95శాతం పూర్తయ్యాయి. మరో వారంలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో పట్టణానికి మరో పక్కన ఉన్న నల్లచెరువు వద్ద ఇంకొక మురుగు నీటి శుద్ధి కేంద్రం మంజూరైంది. స్థల సేకరణ పూర్తి కాగా, త్వరలో పనులు ప్రారంభించి డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో ఎస్టీపీ 10ఎంఎల్డీ సామర్థ్యం కాగా, రోజుకు కోటి లీటర్ల నీటిని శుద్ధి చేయనున్నాయి. జనాభా పెరిగినా మరో 25 ఏండ్లపాటు వీటిని వినియోగించుకునేలా ప్లాన్ చేశారు. ప్లాంట్లో శుద్ధి చేసిన నీటిని వ్యవసాయానికి, పరిశ్రమలకు వినియోగించవచ్చు. వేరు చేసిన గట్టి మురుగును ఎరువుగా కూడా వాడుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.
సూర్యాపేట, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడంతో పాటు, గత పాలకుల పుణ్యమా అని పేరుకుపోయిన సమస్యలపై మంత్రి జగదీశ్రెడ్డి దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేట ప్రజలు మురుగునీటితో ఇబ్బందిపడగా ప్రతి వీధికీ మురుగు కాల్వలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంతో సమస్య పరిష్కరిచారు. పట్టణం నుంచి వెలువడే మురుగునీరు దిగువనున్న పుల్లారెడ్డి, నల్ల చెరువుల్లోకి చేరుతున్నది. దీంతో రెండు చోట్ల మంత్రి శుద్ధి కేంద్రాలను మంజూరు చేయించారు.
పట్టణంలో మురుగు రోడ్లపైకి రాకుండా చేయడమే గాక దిగువకు వెళ్లే మురుగుతో ఇబ్బందిపడే ప్రాంతాలకు విముక్తి కల్పించడంపై మంత్రి దృష్టి సారించారు. సూర్యాపేటలోని పుల్లారెడ్డి చెరువు వద్ద ఒక మురుగునీటి శుద్ధి కేంద్రం మంజూరై 95శాతం పనులు పూర్తి కాగా తాజాగా నల్లచెరువు వద్ద మరోటి మంజూరైంది. పుల్లారెడ్డి చెరువు వద్ద తొలుత రూ.81 కోట్ల వ్యయంతో మంజూరు కాగా మంత్రి చొరవతో మరో రూ.37కోట్లు మంజూరు చేయించడంతో మొత్తం రూ.118కోట్ల వ్యయంతో 10ఎంఎల్డీ కెపాసిటీతో చేపడుతున్న పనులు మరో వారంలో పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణానికి మరో పక్కనున్న నల్లచెరువు వద్ద సైతం మరో 10ఎంఎల్డీ మురుగు నీటి శుద్ధి కేంద్రానికి ఇప్పటికే స్థల సేకరణ పూర్తవగా త్వరలోనే పనులు ప్రారంభించి డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు తెలిపారు. శుద్ధి కేంద్రంలో ఇన్టెక్ వెల్, గ్రిడ్ ఛాంబర్, ఎస్బీఆర్ ట్యాంక్, క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్ ఉండగా మురుగునీరు అన్నింటిలో శుద్ధి జరుగుతూ బయటకు వస్తుంది. ట్యాంక్ అడుగున చేరే బురదను కేక్లా మార్చి దానిని ఎరువుగా వినియోగించనున్నారు.
ఒక్కో 10ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి కేంద్రంతో రోజుకు కోటి లీటర్ల నీటిని శుద్ధి చేయనుండగా రెండూ పూర్తయితే రోజుకు 2కోట్ల మురుగు నీరు శుద్ధి కానుంది. ప్రస్తుతం సూర్యాపేట పట్టణానికి రోజుకు 20ఎంఎల్డీ స్వచ్ఛమైన నీరు వస్తుండగా అందులో 20శాతం మంచినీరు, 80శాతం మురుగునీరు దిగువకు వెళ్తున్నది. ఈ లెక్కన పట్టణం నుంచి వెలువడే 16ఎంఎల్డీ నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. అయితే పుల్లారెడ్డి చెరువు, నల్లచెరువు వద్ద ఒక్కో శుద్ధి కేంద్రం 10ఎంఎల్డీల కెపాసిటీతో నిర్మిస్తుండగా రెండూ కలిపి 20ఎంఎల్డీలు శుద్ధి చేయనున్నాయి. దీంతో వచ్చే 25 ఏళ్ల పాటు పెరుగుతున్న జానాభాకు అనుగుణంగా నీటి శుద్ధి కేంద్రాలను ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
సూర్యాపేటలో పుల్లారెడ్డి చెరువు వద్ద 10ఎంఎల్డీ కెపాసిటీ గల మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు 95శాతం పూర్తవగా త్వరలోనే ప్రారంభించి నీటిని శుద్ధి చేసుకోగలుగుతాము. మంత్రి జగదీశ్రెడ్డి నల్లచెరువు వద్ద సైతం శుద్ధి కేంద్రం ఉండాలనడంతో డీపీఆర్ పూర్తి చేసి ఉన్నతాధికారులకు సమర్పించగా అది సైతం మంజూరైంది. త్వరలోనే పనులు ప్రారంభించి డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. ఈ రెండింటి ద్వారా రోజుకు 20ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేసుకోవచ్చు. రానున్న 25ఏండ్లలో ఎంత జనాభా పెరిగినా రెండు కేంద్రాలు సరిపోయేలా ప్లాన్ చేశాం. ఈ ప్లాంట్ల వల్ల దిగువకు మురుగునీరు చేరి ఆయా ప్రాంతాలు విషతుల్యం గాకుండా విముక్తి లభిస్తుంది.
– సత్యనారాయణగౌడ్, పబ్లిక్ హెల్త్ ఈఈ