యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): జిల్లాలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. రెవెన్యూ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. 2015 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అనురాగ్ జయంతి జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ప్రస్తుత కలెక్టర్ హనుమంతరావు దేవాదాయ శాఖ డైరెక్టర్, గోదావరి ఫుష్కరాల స్పెషల్ ఆఫీసర్గా బదిలీపై వెళ్లారు.
ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్లో బాధ్యతల స్వీకరణ అనంతరం అనురాగ్ జయంతి నమస్తే తెలంగాణతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలు ప్రథమ ప్రాధాన్యమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటానని, ప్రజలకు మేలు జరిగినప్పుడే సంతృప్తి కలుగుతుందన్నారు. ప్రజావాణి దరఖాస్తులపై ఫోకస్ పెడతానన్నారు.అన్ని విభాగాలతో సమన్వయంగా చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు. త్వరలోనే జిల్లాలోని పథకాలు, అభివృద్ధి పనులపై సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
సొంతూరు వైజాగ్.. చదువు ఒడిశా..
“మా సొంతూరు విశాఖపట్నం. మా నాన్న గారి ఉద్యోగ రీత్యా నా చదువు ఒడిశాలో కొనసాగింది. బోధన్, ఖమ్మంలో సబ్ కలెక్టర్గా పనిచేశా. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించా. జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్గా, అడిషనల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టా. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిధిలో పనిచేయడం సంతోషంగా ఉంది.” అని అనురాగ్ జయంతి పేర్కొన్నారు.