రామగిరి, సెప్టెంబర్ 16: పదేండ్ల బాలికపై లైంగికదాడి చేసిన కేసులో నల్లగొండ పోక్సో కోర్టు తీర్పు మంగళవారం సంచనల తీర్పు వెలువరించింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏండ్ల జైలు శిక్ష, రూ.40 వేలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. అలాగే బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలంటూ పోక్సో కోర్టు ఇన్ చార్జ్ జడ్జి రోజారమణి ఆదేశించారు.
వివరాల్లోకి వెళ్తే 2023, మార్చి 28న నల్లగొండ మండలం అన్నెపర్తికి చెందిన మర్రి ఊషయ్య (60) నాలుగో తరగతి చదువుతున్న పదేండ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒకతే ఉన్న సమయంలో ఊషయ్య ఆమెపై లైంగిక దాడిచేశాడు.
ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. తనకు జరిగిన దారుణాన్ని ఆ బాలిక అదేరోజు తల్లికి తెలిపింది. దీంతో ఆమె మరుసటి రోజు నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండేండ్ల విచారణ అనంతరం ముద్దాయిని దోషిగా తేల్చిన కోర్టు.. 24 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది.