జిల్లాలో కమలం పార్టీ అల్లకల్లోలమైంది. బీజేపీలో ఉన్న నలుగురు నేతలు కూడా తలోదారి అన్నట్లు తయారైంది. కొత్త, పాత నేతలు గ్రూపులుగా విడిపోయి అస్తవ్యస్తంగా మారింది. నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఎవరికి వారు యమునా తీరు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీలు దూసుకెళ్తుంటే కాషాయ పార్టీ మాత్రం ఎక్కడా కానరాకుండా పోయింది. భువనగిరి నియోజకవర్గంలో అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి ఒంటరి అయ్యారు. ఆయనకు ఎవరూ సహకరించడం లేదు. దాంతో బీజేపీ క్యాండిడేట్కు డిపాజిట్ దక్కడం కష్టమేనని ఆ పార్టీ నేతలే చెప్పుకొంటున్నారు. ఇక ఆలేరు నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. అక్కడ సైతం అంతర్గతంగా లీడర్ల మధ్య వార్ నడుస్తున్నది. ఉన్న నలుగురు లీడర్లలో సయోధ్య లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు బయటికి వస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం, పథకాలను చూసి బీఆర్ఎస్లో చేరుతున్నారు.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ముం దస్తుగా టికెట్లు ప్రకటించి.. ప్రచారంలో దూసుకెళ్తున్నది. కానీ బీజేపీ మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. జిల్లాలో రోజురోజుకూ పార్టీ మరింత క్షీణించిపోతున్నది. గెలిచే అవకాశాలు కూసింత కూడా లేకపోవడంతో పాత లీడర్లు పక్కకు తప్పుకున్నారు. దీంతో గత్యంతరం లేక బయట నుంచి వచ్చిన లీడర్లను చేరదీసే ప్రయత్నం చేస్తున్నారు. భువనగిరి నుంచి గూడూరు నారాయణరెడ్డి, ఆలేరు నుంచి పడాల శ్రీనివాస్, సుదగాని హరిశంకర్ గౌడ్ను చేర్చుకున్నారు.
బీజేపీ భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డిని ప్రకటించారు. అయితే గూడూరు ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ నుంచి కాషాయ పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీలో అంతకు ముందే పలువురు పాత, సీనియర్ నేతలు టికెట్ ఆశించారు. అయినప్పటికీ మధ్యలో వచ్చిన గూడూరుకు టికెట్ ఇచ్చారు. దీంతో నేతల మధ్య పాత, కొత్త పంచాయితీ నడుస్తున్నది. సాధారణంగా బీజేపీ పాత నేతలకు టికెట్ ఇవ్వకుంటే.. కొత్తగా వచ్చిన నేతలకు వారి సహకరించిన దాఖలాలు పెద్దగా లేవు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఇదే రుజువైంది. దీంతో నియోజకవర్గంలో పాత, కొత్త నేతల మధ్య సయోధ్య కుదరడంలేదు. పైగా గూడూరు నారాయణరెడ్డి పాత నేతలను పెద్దగా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ముందు నుంచి ఉన్న బీజేపీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఆయనకు సహకరించేదిలేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు గూడూరుకు డిపాజిట్ దక్కడంపై ఆ పార్టీ నేతలే గుసగులాడుకుంటున్నారు. ప్రచారానికి పోతే పట్టుమని పది మంది కార్యకర్తలు కూడా ఆయన వెంట ఉండడంలేదని చెవులు కొరుక్కుంటున్నారు.
జిల్లాలో రోజురోజుకు బీజేపీ మరింత క్షీణిస్తున్నది. ఉన్నదే నలుగురు లీడర్లు అయినా వారికి కూడా సయోధ్య లేకపోవడంతో కిందిస్థాయి కేడర్ గందరగోళంలో ఉంది. దీంతో నిత్యం పార్టీ వీడుతున్నారు. వారంతా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం, పథకాలను చూసి పార్టీలో చేరుతున్నారు. ఇటీవల భువనగిరి, ఆలేరు నియోజకర్గంలో జోరుగా చేరికలు జరిగాయి. ఇటీవల భువనగిరి పట్టణంలోని బీజేపీ కౌన్సిలర్ ఊదరి లక్ష్మి, సతీశ్, జిల్లా కార్యదర్శి నీలం రమేశ్తోపాటు తుర్కపల్లికి చెందిన ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డొంకిని రాజు గులాబీ జెండా కప్పుకొన్నారు.
జిల్లాలో మరో నియోజకవర్గమైన ఆలేరులోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఆలేరులోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారనే అపోహ ఉంది. దీంతో ఈ నియోజకర్గంలోనూ పాత, కొత్త అనే లొల్లి నడుస్తున్నది. ఇక ఎలాగూ ఓడిపోయేదని, పోటీ చేసి అభాసుపాలయ్యేది ఎందుకనే ఉద్దేశంతో బరిలో ఉండేందుకు ఓ బీజేపీ కీలక నేత వెనకంజ వేస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా ఉన్న అరకొర కేడర్ కూడా అయోమయంలో పడింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా దొంతిరి శ్రీధర్ రెడ్డి పోటీ చేయగా కేవలం 2.57శాతంతో 4,967 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈసారి అవి కూడా రావనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.