నీలగిరి, ఆగస్టు 11 : నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమలవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా రైతులు సాగునీటి సమస్యల తో నానాఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండినా, ఏఎమ్మార్పీ ప్రాజెక్ట్ ద్వా రా ఆయకట్టుకు తగిననీరు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
ఏఎమ్మార్పీ నాలుగో మోటార్(యూనిట్) క్యాపిటల్ ఓవర్ హాలింగ్ మరమ్మతు పనులు రెండు నెలల క్రితం ప్రారంభమైనప్పటికీ, సకాలంలో పూర్తిచేయకపోవడం ప్రభుత్వవైఫల్యమని విమర్శించారు. జూలైలోనే పూర్తి కావాల్సిన పను లు, ఆగస్టు వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ప్రస్తుతం మూడు మోటార్ల ద్వారా 1,800 క్యూసెకుల నీరు మాత్రమే విడుదల అవుతోందన్నారు. అందులో 525 క్యూసెకులు జంట నగరాలకు, 30 క్యూసెకులు మిషన్ భగీరథకు, 1,200 క్యూసెకులు ఉదయ సముద్రం నింపేందుకు వాడుతున్నారు. దీంతో ఆయకట్టుకు నీరు చేరడం లేదన్నారు.
ప్రణాళిక లోపంతో రైతులకు సాగునీటి కష్టాలు
ప్రధాన కాల్వ నీటి విడుదలను 1,200 క్యూసెకుల నుంచి 950 క్యూసెకులకు తగ్గించారని చిరుమర్తి లింగయ్య అన్నారు. అకంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్కి చేరి, గుడిపల్లి, గుర్రంపోడ్ మండలాల్లో వేల ఎకరాల పంటలు ఎండిపోతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాకుండా శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా విడుదలైన నీటిని నిల్వ చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
సరైన ప్రణాళికతో నిల్వ చేసి ఉంటే నల్లగొండ జిల్లాకు కష్టాలు వచ్చేవి కావన్నారు. ఉదయ సముద్రంకు 1,200 క్యూసెకుల నీటిని కేటాయిస్తూనే, అందులో కేవలం 1.2 క్యూసెకుల నీటిని తాగునీటి కోసం వినియోగించడం, మిగతా నీరును సరైన విధంగా పంపిణీ చేయకపోవడం బాధాకరమన్నారు. కేవలం 0.5 క్యూసెకుల నీటితో బ్రాహ్మణవెల్లంల, ఉదయ సముద్రం, అయిటిపాముల ప్రాజెక్ట్లను నింపడం అసాధ్యమని తెలిసినా ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించిందని తెలిపారు.
చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళనలు
గతేడాది ఇదే పరిస్థితి ఏర్పడినప్పటికీ పాఠాలు నేర్చుకోకుండా, ఈ ఏడాది ముందస్తు ప్రణాళికలు లేకుండా వ్యవహరించడం రైతులపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందన్నారు. సాగర్లో నీరు సమృద్ధిగా ఉండి కూడా, రైతులు ధర్నాలకు దిగే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.
దీనిపై ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకొని ఏఎమ్మార్పీ నాలుగో మోటార్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, మోటార్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చేసి, రోజుకు కనీసం 2,400 క్యూసెకుల నీటి విడుదలకు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లకు సమానంగా సాగునీరు చేరేలా పర్యవేక్షణ బలోపేతం చేయాలని, శ్రీశైలం, ఉదయ సముద్రం నీటి వినియోగంపై సమగ్ర సమీక్ష చేసి, జిల్లాకు గరిష్ట లాభం చేకూరేలా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల రైతుల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని, తక్షణ చర్యలు తీసుకోకపోతే జిల్లా రైతులు ఆందోళనలు చేపట్టే పరిస్థితి తప్పదని హెచ్చరించారు.