చిట్యాల, నవంబర్ 28 : చిట్యాలలో ఆదివారం రాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. పట్టణంలోని సంతోష్నగర్లో నివాసముంటున్న ఓరుగంటి మధుసూదన్, ఓరుగంటి అంజయ్య అన్నదమ్ములు. రెండు కుటుంబాల వారు తమ ఇండ్లకు తాళం వేసి హైదరాబాద్కు వెళ్లారు. దొంగలు రెండు ఇండ్ల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలు తెరిచి అందులో ఉన్న బంగారు, వెండి నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు.
మధుసూదన్ ఇంట్లో మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదు, వెండి వస్తువులు, అంజయ్య ఇంట్లోంచి మూడు తులాల బంగారు నగలు, రూ.8వేల నగదు, వెండి వస్తువులు చోరీ చేశారు. అదే విధంగా అద్దెల సత్తిరెడ్డి ఇంట్లోకి ప్రవేశించి వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లో కూడా చోరీకి యత్నించారు. సోమవారం ఉదయం పెద్దబావిగూడెం ప్రాంతంలో నివాసముంటున్న పోషబోయిన నర్సింహ ఇంట్లోకి చొరబడిన దొంగలు ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.68వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఆయా ఇండ్లను సందర్శించి ఆధారాలు సేకరించారు.
మునగాల : మండల కేంద్రానికి చెందిన వాసా శ్రీనివాస్రావు ఇంట్లో ఆదివారం దొంగలు చొరబడి నగలు, నగదు ఎత్తుకెళ్లారు. శ్రీనివాస్రావు, కళావతి దంపతులు ఈ నెల 24న ఇంటికి తాళం వేసి హైదరాబాద్లో ఉంటున్న కూతురు ఇంటికి వెళ్లారు. ఇంట్లో పూర్తిగా సీసీ కెమెరాలు ఉండడంతో శ్రీనివాస్రావు ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు తన సెల్ఫోన్లో సీసీ పుటేజీలను పరిశీలించిన అనంతరం పడుకున్నాడు. సోమవారం ఉదయం సీసీ కెమెరాలు పని చేయక పోవడంతో తన సోదరిడి కుమారుడు ధనుశ్కు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూసిరమ్మని చెప్పాడు. ధనుశ్కు వారి ఇంటికి వెళ్లగానే తలుపునకు వేసిన తాళం పగులగొట్టి ఉండడం, తలుపులు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.
సీఐ ఆంజనేయులు శ్రీనివాస్రావు ఇంటికి వెళ్లి పరిశీలించారు. శ్రీనివాస్రావు మండల కేంద్రంలోని చెరువుగట్టు శివాలయం చైర్మన్ కావడంతో తమ నగలతో పాటు దేవాలయానికి సంబంధించిన వస్తువులను కూడా ఇంట్లో పెట్టాడు. దొంగలు లోనికి చొరబడి బీరువాలో ఉన్న 18 తులాల బంగారం, 5.250 కేజీల వెండి, రూ. 40 వేలు ఎత్తుకెళ్లారు. దొంగలు సీసీ కెమెరాలతో పాటు హార్డు డిస్క్ను కూడా ఎత్తుకెళ్లారు. పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. వాసా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు, ఎస్ఐ లోకేశ్ తెలిపారు.