యాదగిరిగుట్ట, మార్చి21: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బ్రేక్ దర్శనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు రావడంతో తిరుమాడవీధులు, క్యూ కాంఫ్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, శివాలయం, శ్రీవారి మెట్ల మార్గం సందడిగా మారాయి.
కొండపైన వాహనాల పార్కింగ్ రద్దీగా మారడంతో కొండకిందే వాహనాలను నిలిపి మెట్లమార్గం గుండా కొండపైకి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి దర్శదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఆంజనేయస్వామివారికి సహస్ర నామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. సాయంత్రం వేళలో శ్రీస్వామివారికి గరుడవాహనంపై, అమ్మవారికి తిరుచ్చి సేవపై వేంచేపు చేసి జోడుసేవను తిరువీధుల్లో ఊరేగించారు. ప్రధానాలయ ముఖ మండపంలో దర్బార్ సేవలో భాగంగా సువర్ణమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపి, నక్షత్ర హారతి ఇచ్చారు. రాత్రివేళలో శ్రీస్వామివారి తిరువారాధన చేపట్టి, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఆంజనేయ స్వామివారికి సహస్ర నామార్చన జరిపారు. స్వామివారి ఖజానాకు రూ. 45,18,473 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్ తెలిపారు.