మార్కెట్లోకి కల్తీ విత్తనాలు, పురుగు మందులు రాకుండా సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ముఖ్యంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇటీవల సీడ్ ట్రెజబిలిటీ బార్కోడ్ తీసుకొచ్చింది. వానకాలం సీజన్ నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. కల్తీ విత్తనాలు, పురుగు మందులను నిరోధించేందుకు ఈ నూతన ప్రక్రియ దోహదపడనుంది. ఇప్పటికే కొన్ని ప్రముఖ కంపెనీలు పురుగు మందుల విషయంలో ఈ విధానాన్ని పాటిస్తున్నాయి.
– నూతనకల్, ఏప్రిల్ 23
బార్కోడ్లో సమగ్ర సమాచారం
ప్యాకెట్పై ఉన్న బార్కోడ్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. విత్తనం ఎక్కడ ఉత్పత్తి అయ్యింది.. ఎక్కడ ప్రాసెస్ జరిగింది? ఎవరు ప్యాకింగ్ చేశారు.. మార్కెట్ చేస్తున్న వారెవరనే విషయాలతోపాటు జన్యు స్వచ్ఛత, నాణ్యత ప్రతిదీ బార్కోడ్లో నిక్లిప్తం అయ్యే వీలుంటుంది. దాని కాల వ్యవధిని చెరిపివేసినా పట్టుకునే వీలుంటుంది. ఇప్పటి వరకు విత్తనం బస్తాలకు ట్రూత్ఫుల్ లేబుల్ (టీఎల్) అతికించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలన్నీ ప్రస్తుతం ఇదే చేస్తున్నాయి. ఇందులో సంస్థ వివరాలు, నాణ్యతను నిర్ధారించి ప్రచురిస్తున్నారు. అయితే.. బార్కోడ్ ఉంటే అన్ని విషయాలు తెలుసుకునే వీలుంటుంది. గింజ మొలకెత్తకుంటే అది ఎక్కడ నుంచి వచ్చిందనేది తెలుసుకోవచ్చు.
నకిలీల నియంత్రణ
పురుగు మందులతో పోలిస్తే విత్తనాల్లోనే ఎక్కువ కల్తీ జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ తరహా మోసాలు పత్తి, మిరప వంటి విత్తనాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఏవి అసలో, నకిలీవేవో తెలుసుకోవడం అంత సులువు కాదు. అత్యధికంగా పండించే వరి విషయంలో ప్రైవేటు కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. మొలక శాతం, దిగుబడుల్లో ఇబ్బందులు ఉండవని నమ్మబలికి ఏది పడితే అది బస్తాల్లో నింపి అమ్మేస్తున్నాయి. తేడా వచ్చినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. సంచిపై పక్కాగా కోడ్ ఉండేలా నిబంధనలు తెస్తే నకిలీలను కచ్చితంగా నియంత్రించే వీలుంటుందని అధికారులు అంటున్నారు.
బార్కోడ్తో రైతులే గుర్తించొచ్చు
విత్తనాలకు బార్ కోడ్ అమలు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సంచులపై బార్ కోడ్ అందుబాటులోకి వస్తే రైతులే దాని సమగ్ర సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ఏమైనా సందేహాలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ప్రతికూల ఫలితాలు వస్తే చట్టపరంగా తీసుకునే చర్యలకు కోడ్ దోహదపడుతుంది.
– మురళిబాబు, మండల వ్యవసాయ అధికారి, నూతనకల్