ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు యాదాద్రి భువనగిరి జిల్లాను సస్యశ్యామలం చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే బస్వాపూర్ (నృసింహ సాగర్) రిజర్వాయర్ ద్వారా యాదగిరిగుట్ట క్షేత్రానికి గోదావరి జలాలు చేరుకోగా, ఇక ఆలేరు నియోజకవర్గంలోని భూములను తడిపేందుకు పరుగులు పెడుతూ వస్తున్నాయి. 2020 సంవత్సరంలోనే కొండపోచమ్మ సాగర్ నుంచి తుర్కపల్లి ప్రధాన కాల్వ ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు సాగు నీరు మొదలవగా, తాజాగా మన్నెవారి తుర్కపల్లి ప్రధాన కాల్వ సైతం సిద్ధమైంది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట రెగ్యులేటర్ వద్ద శుక్రవారం ఈ కాల్వలోకి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, అటవీ అభివృద్ధి
సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. దీని ద్వారా తుర్కపల్లి,
బొమ్మలరామారం మండలాల్లో 868 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది.
20 చెరువులను నింపనున్నది.
యాదగిరిగుట్ట/ తుర్కపల్లి, మార్చి 9 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి సాగుజలాలు అందించాలన్న లక్ష్యానికి దారులు సుముగమయ్యాయి. గత పాలకుల నిర్వాహకంతో బీడు బారిన ఆలేరు. ప్రస్తుతం గోదారమ్మ పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన నృసింహసాగర్(బస్వాపూర్)జలాశయంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి చెంతకు గోదావరి జలాలు రాగా గత 2020లోనే తుర్కపల్లి, బొమ్మల రామారం మండలాలు కొండపోచమ్మసాగర్ జలాలతో కళకళ లాడుతున్నాయి. తాజాగా రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మరో ముందడుగు వేశారు. ఇందుకోసం నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి కొండపోచమ్మ సాగర్ నుంచి సాగుజలాలు అందించనున్న మరో ఎం.తుర్కపల్లి ప్రధాన కాల్వ ను పూర్తి చేసి సాగు జలాలను అందించే పనిలో పడ్డారు. శుక్రవారం ఎం.తుర్కపల్లి ప్రధాన కాల్వ ప్రారంభంతో తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయి.
కాళేశ్వరం జలాలను రాష్ట్ర వ్యాప్తంగా అందించాలన్న లక్ష్యంతో 15 టీఎంసీల సామర్థ్యంతో సిద్దిపేట జిల్లాలో నిర్మించిన అతి పెద్ద ప్రధాన జలాశయం కొండపోచమ్మ సాగర్. ఈ జలాశయం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు సాగు జలాలను అందించాలన్న లక్ష్యంతో తుర్కపల్లి, ఎం.తుర్కపల్లి అనే రెండు ప్రధాన కాల్వలు నిర్మించారు. ఇప్పటికే 2020లో తుర్కపల్లి ప్రధాన కాల్వ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాగా, అదనంగా మరో ఎం. తుర్కపల్లి ప్రధాన కాల్వ 24 కిలోమీటర్ల వరకు నిర్మించగా 15.375 కిలో మీటర్ల వరకు పనులు పూర్తయ్యా యి.
ఈ కాల్వ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్పూర్ మండలం దామరకుంటలో ప్రారంభమై ఖాసిరెడ్డిపల్లి గుండా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం కొండాపూర్, వాసాలమర్రి, మల్కాపురం, బొమ్మలరామారంలోని పిల్లిగుండ్లతండా వరకు వస్తున్నది. ప్రస్తుతం 28 డీపీలు నిర్మించనుండగా 11 పూర్తయ్యాయి. 13 డిస్ట్రిబ్యూటరీ కాల్వలు నిర్మించాల్సి ఉండగా పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం మల్కాపురం గ్రామం వరకు పనులు పూర్తి కాగా 868 ఎకరాలు ఆయకట్టు సాగులోకి రాగా, 20 చెరువులు పూర్తిగా నిండనున్నాయి. కాల్వ పనులు పూర్తయితే తుర్కపల్లి మండలం చిన్నలక్ష్మాపూర్, ధర్మారం, కొం డాపూర్, తుర్కపల్లి(ఎం), ముల్కలపల్లి, పల్లెపహాడ్, రుస్తాపూర్, శ్రీనివాసాపురం, తిరుమ లాపూర్, వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, వెంకటాపురం గ్రామాల్లో 11,380, బొమ్మల రామారం మండలం చీకటిమామిడి, మర్యాల గ్రామాల్లో 5,015 ఎకరాలకు సాగు జలాలు అందుతాయి.
తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు సాగుజలాలు అందించాలని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి కృషితో 2020 లోనే తుర్కపల్లి ప్రధాన కాల్వ అందుబాటులోకి వచ్చింది. ఈ కాల్వ గజ్వేల్ నియోజకవర్గంలోని శివారు వెంకటాపురం వద్ద ప్రారంభమై దామరకుంట నుంచి ఓటీ కాల్వ ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని గోపాల్పూర్, నాగాయిపల్లి, చిన్నలక్ష్మాపూర్, మాదాపూర్, బొమ్మలరామారం మండలం బొమ్మాయిపల్లి, తిమ్మాపురం, చీకటిమామిడి, సోలిపేట, ప్యారారం గ్రామాల్లో 14 చెరువులోకి సాగు జలాలు, అక్కడి నుంచి ఓటీ గుండా గోపాల్పూర్, చిన్నలక్ష్మాపూర్, మాదాపూర్, చీకటిమామిడి, నాగాయిపల్లి, తిమ్మాపూర్, బొమ్మలరామారం మండలం ప్యారారం, సోలిపేట గ్రామాల్లోని 3 ఓటీల ద్వారా 14 చెరువులను నింపారు. 32.8 కిలో మీటర్లు ప్రవహించి గజ్వేల్ నియోజకవర్గంలోని కరకపట్లకు తుర్కపల్లి ప్రధాన కాల్వ చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ కాల్వ ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం గ్రామాల్లో 1,285 ఎకరాలు ఆయకట్టు సాగులోకి వచ్చింది.
గుంట భూమికి సైతం సాగుజలాలను అందించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం సిద్ధించింది. ఆయన సంకల్పంతో గతంలో కొండపోచమ్మ సాగర్ నుంచి తుర్కపల్లి, బొమ్మలరామారం మండలంలోని పలు ప్రాంతాలకు సాగు జలాలను అందించాం. పూర్తిస్థాయిలో సాగుజలాలు అందించాలన్న లక్ష్యంతో మన్నెవారి తుర్కపల్లి ప్రధాన కాల్వను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రాబోయే రోజుల్లో నృసింహ సాగర్ జలాశం డిస్ట్రిబ్యూటరీ కాల్వ, బునాదిగానీ కాల్వ, ఆశ్వరావుపల్లి, నవాబ్పేట జలాశయాలతో ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం. -గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్