బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజుల కిందటి వరకూ లోటు వర్షపాతం ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పలు మండలాల్లో అదనపు వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు చాలా వరకు జలకళ సంతరించుకోగా కొన్ని అలుగు పోస్తున్నాయి. భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంటల సాగుకు ఢోకా లేదు. నీళ్లు సమృద్ధిగా ఉండడంతో వరితోపాటు పత్తి, కంది ఇతర పంటల సాగు జోరందుకున్నది. ఇప్పటికే మెట్ట పంటల్లో కలుపు తీయడంతో పాటు అడుగు మందు పెట్టే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 7,41,666 ఎకరాలు, సూర్యాపేటలో 1,23,238 ఎకరాలు, యాదాద్రి భువనగిరిలో 2,29,501 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,935 చెరువులు ఉండగా 890 నిండి మత్తడి దుంకుతున్నాయి. నల్లగొండ జిల్లాలో సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో 25శాతం మాత్రమే చెరువులు నిండాయి.
– నల్లగొండ ప్రతినిధి, జూలై 28 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, జూలై 28 (నమస్తే తెలంగాణ) : అల్పపీడన ప్రభావంతో నల్లగొండ జిల్లాలో కురిసిన వర్షాలు పంటలకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. ముఖ్యంగా పత్తి, కంది వంటి మెట్ట పంటలతోపాటు నాన్ ఆయకట్టులో వరి నాట్లు కూడా ఊపందుకున్నాయి. ఈ సీజన్లో తొలిసారిగా సంవృద్ధిగా వర్షం కురిసింది. ఈ వానకాలం సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 7.41 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇందులో మెజార్టీ భాగం మెట్ట పంటలదే. ఆగస్టు చివరి నాటికి సాగర్ ఆయకట్టులో వరి నాట్లు పూర్తయితే ఈ సీజన్లో పంటల సాగు కాలం ముగియనుంది.
అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు భారీ వర్షాలు లేని లోటు తీరినైట్లెంది. వాస్తవంగా సీజన్ ఆరంభం నుంచి మంచి వర్షాలు లేవు. దీంతో పంటల సాగు కొంత ఆలస్యమైంది. ఈ నెల మూడో వారంలో కురిసిన వర్షాలతో మెట్ట పంటల సాగు దాదాపు దగ్గర పడింది. ఇంకా సాగు కావాల్సిన పంటలకు ప్రస్తుతం కురిసిన వర్షాలు ఊతం ఇవ్వనున్నాయి. ఈ వానకాలంలో నల్లగొండ జిల్లాలో మొత్తం 11,93,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వారి లెక్కల ప్రకారం ఇప్పటివరకు 7,41,666 ఎకరాల్లో సాగయ్యాయి. అందులో పత్తి పంటనే 5,82,446 ఎకరాలు. ఈ సీజన్లో పత్తి సాగు అంచనా 6.50లక్షల ఎకరాలుగా అధికారులు అంచనా వేశారు. 10వేల ఎకరాల్లో కంది పంట సాగు అంచనాకుగానూ 1,586 ఎకరాల్లోనే సాగైంది. ఇతర అన్ని రకాల పంటలు కలిపి మరో 11,094 ఎకరాల్లో సాగయ్యాయి. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం మరో 72వేల ఎకరాల్లో మెట్ట పంటల సాగు పూర్తయితే ఈ సీజన్ సాగు అంచనా పూర్తయినట్లే. మిగిలిన పంటలు సైతం ప్రస్తుత వర్షాలతో సాగు కానున్నట్లు భావిస్తున్నారు.
మెట్ట పంటలకు ఉపయుక్తం
ప్రస్తుత వర్షాలు మెట్ట పంటలకు ఉపయుక్తం కానున్నాయి. కలుపు తీయడంతోపాటు ఎరువులు వేయడానికి అనువుగా మారింది. ఇప్పటికే రెండు, మూడ్రోజులుగా రైతులు పంట చేలల్లో బిజీ అయ్యారు. పల్లెల్లో పూర్తిగా సాగు పనుల్లోనే నిమగ్నమయ్యారు. మరోవైపు ఈ వర్షాలకు ముందు వరకు 50వేల ఎకరాల్లోనే వరి సాగు కాగా, ఈ వారం రోజుల్లోనే భారీగా జరిగింది. ఈ సీజన్లో మొత్తం 5.25లక్షల ఎకరాల్లో సాగు అంచనాకుగానూ గురువారం నాటికి 1.46లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఇందులో మెజార్టీ భాగం నాన్ ఆయకట్టు పరిధిలోనిదే. మిగిలిన సాగులో సింహభాగం సాగర్ ఆయకట్టుదే కాగా.. నాగార్జునసాగర్ నుంచి ఇంకా సాగునీరు విడుదల కాలేదు. గత ఏడాది జూలై 28న సాగర్ ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క చుక్క కూడా సాగర్కు వరద రాలేదు. సాగర్లో 590 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టానికిగానూ ప్రస్తుతం 515.50 అడుగులు మాత్రమే ఉన్నది. కాగా, ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో మొదలైంది. త్వరలోనే శ్రీశైలం నుంచి సాగర్కు నీటి విడుదల జరిగితే ఆయకట్టుపై ఆశలు చిగురించనున్నాయి.
సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో..
సూర్యాపేట జిల్లాలో ఈ వానకాలంలో ఇప్పటి వరకు వరి 55,335 ఎకరాల్లో సాగైంది. పత్తి 66,258 ఎకరాల్లో. కంది 1,030, పెసర 293, వేరుశనగ 152 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 4.91 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు అంచనా వేయగా.. ఇప్పటివరకు 2,29,501 ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో వరి 1,21,780 ఎకరాల్లో, పత్తి 98,421, ఇతర పంటలు 9,300 ఎకరాల్లో సాగైనట్లు అధికారులు వెల్లడించారు.
నిండుకుండలా చెరువులు
జూన్ రెండో వారంతో పోలిస్తే ప్రస్తుతం చెరువులకు జలకళ ఉట్టిపడుతున్నది. ముఖ్యంగా యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో మెజార్టీ చెరువులు పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరగా ఉండడంతోపాటు అలుగులు పోస్తున్న వాటి సంఖ్య కూడా గణనీయంగా ఉన్నది. ఓ వైపు మూసీ పొంగిపొర్లుతుండడం, భారీ వర్షాలు కురువడంతో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. జూన్ రెండో వారంలో ఏడు చెరువులు మాత్రమే అలుగులు పోయగా, ఇప్పుడు 890 చెరువులు అలుగు పారుతున్నాయి. నల్లగొండ జిల్లాలో మాత్రం వర్షాలు తక్కువగా ఉండడంతో సగం చెరువుల్లో ఇంకా 25శాతం లోపే నీరు ఉన్నది.
వాగుల ఉధృతి.. నిలిచిన రాకపోకలు
మోతె, జూలై 28 : పది రోజుల నుంచి మండల వ్యాప్తంగా కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో మండలంలోని తుమ్మగూడెం – ఉర్లుగొండ, విభలాపురం – మామిళ్లగూడెం రహదారులపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఈ రోడ్లపై ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
భీమారం బ్రిడ్జిపై పోటెత్తిన వరద వాహనాల దారి మళ్లింపు
సూర్యాపేట రూరల్, జూలై 28 : మూసీ ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో దిగువన వరద ఉధృతి పెరిగింది. దాంతో మండలంలోని వెదిరెవారిగూడెం వద్ద భీమారం బ్రిడ్జి పైనుంచి వరద పోటెత్తుతుండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వచ్చే వాహనాలను భీమారం నుంచి కొప్పోలు, టేకుమట్ల మీదుగా మళ్లిస్తున్నారు. భీమారం బ్రిడ్జిని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట రూరల్ సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ సాయిరాం, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
శ్రీశైలానికి 1.62లక్షల ఇన్ఫ్లో
నల్లగొండ ప్రతినిధి, జూలై 28 (నమస్తే తెలంగాణ) : కృష్ణానదిపై ఉన్న కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తున్నది. శుక్రవారం రాత్రి 9గంటల సమయానికి లక్షా 62వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో గడిచిన 24 గంటల్లోనే 9 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. అదనంగా ఏడు టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు నాలుగు రోజుల కిందటే పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తేశారు. ఆ నీరంతా జూరాల ప్రాజెక్టును ముంచెత్తుతున్నది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1.20లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఆ ప్రాజెక్టు ఇప్పటికే నిండి ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1.20లక్షల క్యూసెక్కులను అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు 22 గేట్ల ద్వారా 83,138 క్యూసెక్కులు, పవర్ ఉత్పత్తి ద్వారా 37,252 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో 1,62,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు శ్రీశైలం డ్యామ్ అధికారులు వెల్లడించారు. శ్రీశైలం రిజర్వాయర్లో 885అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గానూ 826.50 అడుగులకు చేరింది. 215.87 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యానికిగానూ ప్రస్తుతం 46.13 టీఎంసీలు నమోదైంది. గురువారం సాయంత్రం 6గంటల సమయానికి 71,547 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవగా 817.70 అడుగుల నీటిమట్టంతో 39.20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. 24గంటల్లోనే 9 అడుగుల మేర పెరిగి ఆరున్నర టీఎంసీల నీరు అదనంగా వచ్చి చేరడం విశేషం. శ్రీశైలంలో పెరిగే నీటిమట్టం ఆధారంగా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ నీరంతా నాగార్జునసాగర్కు రానుంది.
చేపల వేటలో..
తిరుమలగిరి, జూలై 28 : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. మామిడాలలోని చెరువు, రావిచెరువు తండాలోని రావిచెరువు అలుగు పోస్తుండగా.. ప్రజలు చేపల వేట చేపట్టారు. వెలిశాల గ్రామంలో స్తంభం విరిగి విద్యుత్కు అంతరాయం కలుగడంతో సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్ను పునరుద్ధరించారు.
విజయవాడ హైవేపై రాకపోకలు పునరుద్ధరణ
కోదాడ రూరల్, జూలై 28 : విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద ఉధృతి తగ్గడంతో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీలోని కీసర టోల్గేటు సమీపంలో ఐతవరం శివారులో మున్నేరు వాగు ఉప్పొంగి ఎక్స్ప్రెస్ హైవేపైకి వరద నీరు చేరింది. దీంతో విజయవాడ, హైదరాబాద్ నగరాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలను సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ శివారులోని హుజూర్నగర్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. వాహనదారులు కోదాడ నుంచి హుజూర్నగర్, మిర్యాలగూడ, దాచేపల్లి మీదుగా గుంటూరు నుంచి విజయవాడ చేరుకోవాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లవలసిన వాహనాలను గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడ, నార్కట్పల్లి మీదుగా పంపిస్తున్నారు. అయితే.. రాత్రి 8గంటల సమయంలో వరద ఉధృతి తగ్గడంతో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
చినుకు పడ్డా చింత లేదు
అడవిదేవులపల్లి జిలకరకుంట తండాలో గతంలో చినుకు పడితే వీధులు చిత్తడిగా మారి నడిచేందుకు వీల్లేకుండా ఉండేవి. స్వరాష్ట్రంలో ప్రభుత్వం రూ.50లక్షలతో గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేసింది. దీంతోగ్రామస్తుల తిప్పలు తప్పడంతోపాటు పరిశుభ్ర వాతావరణం నెలకొన్నది. ఇప్పుడు భారీ వర్షం కురిసినా ఎటువంటి చింతా లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
– అడవిదేవులపల్లి, జూలై 28