సూర్యాపేట, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ అనుకున్న దానికి మించి సక్సెస్ అయ్యింది. సభ సక్సెస్ఫుల్గా జరిగేందుకు మంత్రి చేసిన మంత్రాంగం ఫలించింది. మూడ్రోజులుగా వర్షం వెంటాడినా వెరవకుండా పిడుగులు పడ్డా సభను ఆపేది లేదంటూ ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలు, బెలూన్లతో పట్టణం మొత్తం గులాబీమయమైంది.
సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్రెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలను ఇన్చార్జీలుగా నియమించి సభకు తరలి వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు చేపట్టారు. తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో జనం సభకు చేరుకున్నారు. లక్ష నుంచి లక్షన్నర వరకు జనం వస్తారని అంచనా వేయగా 75 ఎకరాల్లో నిర్వహించిన సభ అంతకుమించి వచ్చిన జనంతో కిటకిటలాడింది. సభా ప్రాంగణం మొత్తం నిండిపోగా ఎటూ కిలోమీటరున్నర మేర భారీగా జనం కనిపించారు. కాళేశ్వరం జలాలు రావడం, రైతు రుణమాఫీ చేయడంతో ఊహించని విధంగా రైతులు పెద్ద ఎత్తున తరలి రాగా.. సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకు నవ్వులు పంచుతున్న సీఎం కేసీఆర్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు.
జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవాల సందర్భంగా పట్టణ వీధుల్లో సీఎం కాన్వాయ్ తిరిగింది. ఈ సందర్భంగా తమ అభిమాన నేత కేసీఆర్కు స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు చెబుతూ జనం పూల జల్లులు కుర్పించారు. సభ వద్ద సీఎం ప్రసంగిస్తున్న సమయంలో జనం కేరింతలు కొట్టారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూ నినాదాలు చేస్తూ సభను హోరెత్తించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిసేవరకూ జనం నినాదాలతో హోరెత్తి పోయింది. విధిలేని పరిస్థితుల్లో నినాదాలు ఆగే వరకు రెండు నిమిషాల పాటు ప్రసంగాన్ని ఆపి జనాన్ని చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణతోపాటు సూర్యాపేటలో చేసిన అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడల్లా చప్పటు ్ల, కేరింతలు కొడుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ సాధించింది శూన్యం.. తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధిని అడ్డుకుంటూ బీజేపీ చేస్తున్న ద్రోహాలను వివరించారు. ఇలాంటి ప్రతిపక్షాలు ఉండాల్సిన అవసరం ఉందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించడంతో సభికులు వద్దు.. వద్దు అంటూ నినాదాలు చేశారు. మొత్తం మీద సూర్యాపేట సభకు అతి తక్కువ సమయంలో ఐదు రోజుల్లోనే ఘనమైన ఏర్పాట్లు చేయగా.. ఊహించిన దానికంటే జనం రావడం సభ సక్సెస్ కావడం పట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది.