ధరల మీద ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆఖరికి అనారోగ్యం పాలైన రోగులనూ వదిలిపెట్టడం లేదు. బీపీ, షుగర్, జలుబు, జ్వరం మొదలుకుని గుండె, మూత్రపిండాల వంటి అనేక రకాల జబ్బులకు వినియోగించే మందు గోలీలపై 12.12శాతం ధరలు పెంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలోనే 10.76 శాతం పెంచిన మోదీ సర్కారు ఇప్పుడు అంతకుమించి భారం మోపింది. ఈ భారం ఒక్క సూర్యాపేట జిల్లా వాసులపైనే నెలకు దాదాపు కోటిన్నర రూపాయలు పడుతుండడం గమనార్హం.
నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ దగ్గరి నుంచి మంచానపడ్డ మనిషికి అవసరమయ్యే ఔషధాల ధరల దాకాపెంచి కేంద్ర ప్రభుత్వం పీల్చిపిప్పి చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీపీ, షుగర్ వంటి అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎన్సీడీ కిట్ల రూపంలో మందులు అందిస్తుండగా, కేంద్రం మాత్రం ధరలు పెంచడంపై రోగులు మండిపడుతున్నారు. ఔషధాల ధరల పెంపును నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
-సూర్యాపేట, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, ఏప్రిల్1 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తూ.. ఇంటివద్దకే డాక్టర్లను పంపి పరీక్షలు చేయించి అవసరమైన మందులను ఉచితంగా అందిస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం మందుల ధరలను పెంచుతూ పోతున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులతో పాటు నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యులపై పెను భారం మోపిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రాణాలు నిలిపే మందుల ధరలను సైతం పెంచింది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఇప్పటి వరకు పేద, మధ్య తరగతి వర్గాలు వినియోగించే వస్తువులపై జీఎస్టీ విధిస్తూ వాటి ధరలను అమాంతంగా పెంచేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగడంతో వాటి ప్రభావం అన్ని రంగాలపై పడి సామాన్యుడికి అందకుండా పోతున్నాయి. తాజాగా బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, కిడ్నీ పేషంట్లతో పాటు క్షయ, జ్వరం, జలుబు వంటి అన్ని రోగాలకు వాడే మందులపై అదనంగా 12 శాతం ధరలు పెంచింది.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై అదనపు భారం
కేంద్ర ప్రభుత్వం మందుల ధరలు అమాంతం పెంచడంతో జిల్లాలో దీర్ఘకాలిక రోగలపై కోటిన్నరకు పైనే భారం పడనుంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 62,131 మంది బీపీ పేషంట్లు ఉండగా వారు వాడే గోలీలకు నెలకు రూ.100 నుంచి 150 వరకు అవుతుంది. ప్రస్తుతం పెరిగిన ధరలతో రూ.130 నుంచి 180 కానుంది. అలాగే 37,250 మంది షుగర్ వ్యాధి గ్రస్తులు మందులు వాడుతుండగా ఒక్కొక్కరు ప్రతి నెలా రూ. 250 నుంచి 400 వరకు ఖర్చు అవుతుంది. పెరిగిన ధరలతో ఇక మీదట రూ.245 నుంచి 445 కానుంది. కొవిడ్ మహమ్మారి తర్వాత రెండేండ్లుగా వయస్సుతో సంబంధం లేకుండా 15 ఏండ్ల నుంచి 80 ఏండ్ల వరకు గుండె పోటుతో మరణించే వారి సంఖ్య పెరిగింది. దాంతో గుండె పరీక్షలు చేసుకుంటూ సంబంధిత మందులు వాడే వారి సంఖ్య గతంతో పోల్చితే భారీగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో గుండె సంబంధిత మందులు వాడే వారి సంఖ్య 2500 లకు పైనే ఉంటుందని అంచనా. వీరు ప్రతి నెలా రూ.900ల నుంచి రూ.1200 విలువైన మందులు వినియోగిస్తారు. పెరిగిన ధరల కారణంగా ఇప్పుడు రూ. 1000 నుంచి 1300 కానున్నది.
కిడ్నీ వ్యాధి గ్రస్తులపై
కిడ్నీ వ్యాధి గ్రస్తులు కూడా సుమారు 650 మంది వరకు ఉన్నారు. వీరికి ప్రతి నెలా మందుల ఖర్చు రూ.3 నుంచి 4వేల వరకు అవుతుండగా 12 శాతం పెరుగుదలతో రూ. 3400 నుంచి 4500 వరకు కానున్నది. వీటికి తోడు జలుబు, జ్వరంతో పాటు అనేక రోగాలకు వాడే మందుల ధరలు కూడా పెరగడంతో సామాన్యులపై భారం పడనున్నది. జిల్లాలో పలు దీర్గకాలిక వ్యాధులకు మందులు వాడే వారు దాదాపు 1.5 లక్షల మంది ఉన్నట్లు ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతుండగా పెరిగిన ధరల ప్రకారం వారిపై నెలకు రూ.కోటిన్నరకు పైనే భారం పడనుంది. దాంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మందుల ధరలు పెంచడం బాధాకరం
కేంద్రం ప్రభుత్వం మందుల ధరలు పెంచుతూ పోవడం బాధాకరం. సీఎం కేసీఆర్ సారు ఇంటి దగ్గరకే డాక్టర్లను పంపి పరీక్షలు చేయించి ఉచితంగా మందులు అందిస్తున్నరు. మరి గరీబోల్ల సర్కార్ అని చెప్పుకొనే కేంద్ర ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను చానా సార్లు పెంచింది. వయస్సు మీద పడిన వారికి తక్కువ ధరలకు మందులు అందజేసే బదులు బీపీ మందుల రేట్లు కూడా పెంచడం దారుణం. రానున్న రోజుల్లో వారికి తగిన బుద్ధి చెబుతం.
-ఎం కోట్యా, దేవ్లాతండా, పాలకవీడు మండలం
పేదలపై భారం మంచిది కాదు
సీఎం కేసీఆర్ సార్ మా ఊరికే డాక్టర్లను పంపించి పరీక్షలు చేయించి మాకు మందులు ఫ్రీగా ఇస్తున్నడు. గవర్నమెంట్ దవాఖానకు వెళ్లినా అక్కడ కూడా మంచిగ వైద్యం చేస్తున్నరు. ఇంతకుమునుపు ఏదైనా జబ్బు చేస్తే ప్రైవేట్ దవాఖానకు వెళ్లి పైసలు ఖర్చు చేసుకునేటోళ్లం. ఇప్పుడు సూర్యాపేటలో పెద్ద దవాఖానతో పాటు ఊర్లల్లో కూడా పల్లె దవాఖానలు పెట్టి మంచిగ వైద్యం చేస్తున్నరు. రాష్ట్ర గమర్నమెంట్ ఇంత మంచిగ చేస్తుంటే.. కేంద్రం ప్రభుత్వం మందుల ధరలు పెంచి పేదోళ్లపై భారం వేయడం మంచిది కాదు.
-నర్ర సుగుణమ్మ, సోలిపేట