కట్టంగూర్/ నకిరేకల్, నవంబర్ 25 : కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపుతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన టీడీపీ మండలాధ్యక్షుడు తోటకూరి యాదయ్య ఆధ్వర్యంలో వార్డు సభ్యులతోపాటు 150 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే సమక్షంలో నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా నకిరేకల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వంద మంది గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదన్నారు.
కేంద్ర సర్కారు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. వాటికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ దేశంలో, రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యమ పార్టీగా అవతరిస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు, ప్రగడపు నవీన్రావు, మండల ప్రధాన కార్యదర్శి వడ్డె సైదిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, సర్పంచ్ పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ వెంకటాచారి, నాయకులు పాల్గొన్నారు.