నల్లగొండ ప్రతినిధి, మే27(నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సరళిలో బీఆర్ఎస్ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో సైతం బీఆర్ఎస్ ప్రభావం వెల్లడైంది. పోలింగ్ ప్రారంభం నుంచి చివరి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి, ఓటర్ల నాడిని బట్టి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికే మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా పడినట్లు తెలుస్తున్నది. ఈ ఎన్నికల విషయంలో అభ్యర్థి ఎంపిక నుంచి మొదలు పెడితే చివరలో పోల్ మేనేజ్మెంట్ వరకు బీఆర్ఎస్ పకడ్బందీగా వ్యవహరించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాల్లో పాల్గొనడంతోపాటు బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థుల్లో రాకేశ్రెడ్డి గుణగణాలు, అర్హతలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను, ప్రస్తుత మోసాలను వివరించడంతోపాటు కేసీఆర్ ప్రభుత్వ పథకాలను మరోసారి గుర్తు చేయడం, అభ్యర్థులందరిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా మెరుగైనవాడో వివరించడంతో మంచి స్పందన లభించింది. ‘బిట్స్ ఫిలానీ కావాలా… పల్లీ బఠానీ కావాలా’ అని కేటీఆర్ సంధించిన అస్త్రం పట్టభద్రులను ఆలోచనల్లో పడేసింది. ఇక ఉమ్మడి జిల్లా పరిధిలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పార్టీ మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ముఖ్యులందరినీ సమన్వయం చేస్తూ అవిశ్రాంతంగా పర్యటించారు. నియోజకవర్గాల వారీగా పలుమార్లు సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేయడంతో పార్టీ నేతలు, శ్రేణులు క్షేత్రస్థాయి వరకు ఉత్సాహంగా పనిచేశారు. పోలింగ్ రోజు సోమవారం కూడా దాదాపు ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రధాన పట్టణాల్లో పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ శ్రేణులతో మమేకమయ్యారు.
పోలింగ్ సరళిని పరిశీలిస్తూ, అన్నిచోట్ల బీఆర్ఎస్కు మంచి ఆదరణ ఉందని, మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వీటన్నింటి రీత్యా చివరి వరకు బీఆర్ఎస్ శ్రేణుల శ్రమను ప్రతిబింబిస్తూ పోలింగ్ సరళిలో గులాబీ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. ప్రథమ ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికే పడినట్లుగా తెలుస్తున్నది. ఉప ఎన్నికల్లో కష్టపడి పనిచేసి ఓటర్లను కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులకు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆది నుంచే కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా ఉందన్న చర్చ మొదలైంది. పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ఎంపిక నాటి నుంచే మెజార్టీ నేతలు పెదవి విరిచినట్లే ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులైన కోమటిరెడ్డిని, ఉత్తమ్తో పాటు ఇతర కీలక నేతలందరినీ తీన్మార్ మల్లన్న ఏదో ఒక కారణంతో గతంలో ఇష్టారీతిన తన చానల్ వేదికగా దూషించారన్నది నిజం. ఈ నేపథ్యంలో వీరితో పాటు వీరి అనుచరులెవరూ మల్లన్న అభ్యర్థిత్వాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించిన పరిస్థితి లేదు. ఈ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ముఖ్యులను తీన్మార్ మల్లన్న దూషించే వీడియోలన్నీ సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారడంతో పుండుమీద కారం చల్లినైట్లెంది. వీటన్నింటికీ తోడు ప్రచారంలో సైతం మల్లన్న అభ్యర్థిత్వం పట్ల ఓటర్ల నుంచి సానుకూలత లభించలేదు. దాంతో ఏదో పార్టీ ప్రకటించింది కాబట్టి పైపైన ప్రచారం కానిచ్చినట్లు చేశారు.
పోలింగ్ రోజున కూడా కేంద్రాల వద్ద కాంగ్రెస్లో అధికార పార్టీ ఉత్సాహం కనపడలేదు. ఇక మల్లన్నకు మద్దతుగా ప్రచారానికి దూరంగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు పోలింగ్కు రెండు రోజుల ముందే విదేశాలకు వెళ్లిపోయారు. మంత్రి ఉత్తమ్ కూడా హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఎమ్మెల్యే జయవీర్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి ఇటువైపు రాలేదు. ఇలా కీలక నేతలు అంటీముట్టనట్లుగా ఉండడంతో పార్టీ శ్రేణులు కూడా అలాగే వ్యవహరించాయన్నది నిజం. దాంతో పోలింగ్కు ముందే కాంగ్రెస్ పార్టీ కాడెత్తిసినట్లు విస్తృత ప్రచారం సాగడంతో బీఆర్ఎస్కు మరింత సానుకూల వాతావరణం ఏర్పడడానికి తోడ్పడిందన్న చర్చ కొనసాగింది. ఇవన్నీ ఎలా ఉన్నా ఫైనల్గా వచ్చే నెల 5 నుంచి కొనసాగే ఓట్ల లెక్కింపుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.