చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శ్రీకారం చుట్టారు. తొలిరోజు వేద పండితులు గణపతిపూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట, బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం వంటివి చేపట్టారు. ఆరు రోజుల పాటు సాగనున్న వేడుకల్లో ఆదివారం తెల్లవారుజామున స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనుండగా, శనివారం రాత్రికే భక్తులు పెద్దసంఖ్యలో చెర్వుగట్టుకు చేరుకున్నారు.
నార్కట్పల్లి, జనవరి 28 : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్, ఆలయ ఇన్చార్జి ఈఓ నవీన్, యాజ్ఞీకులు అల్లవరపు సుబ్రమణ్యం దీక్షావధానం, ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ పరిపట్టం కట్టి ఆలయ సంప్రదాయం ప్రకారం సన్నాయి వాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో ఎదురేగి స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని ఆలయ మహా మండపంలో వేద పండితులు శివశ్రీ నీలకంఠ శివాచార్య యాత్వీకులు గణపతి పూజ, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పుణ్యాహవాచనం, పంచజన్య, పూజాప్రోక్షణ, అఖండ స్థాపన, త్రిశూల పూజ, సూర్య నమస్కార పూజలు చేశారు. అగ్ని ప్రతిష్ఠాపన సృష్టికర్త బ్రహ్మ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, సినీ డైరెక్టర్ ఎన్.శంకర్, సర్పంచ్ మల్గ బాలకృష్ణ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డిని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్, ఆలయ ఇన్చార్జి ఈఓ నవీన్ శాలువాలతో సన్మానించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారి కల్యాణానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వం తరఫున తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు తేనున్నారు.
భక్తుల కోరికలు తీర్చే మహిమాన్విత క్షేత్రమైన
చెర్వుగట్టు అభివృద్ధికి కృషి చేస్తాను. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో దేవాలయాలు పూర్వవైభవం సంతరించుకున్నాయి. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి. భక్తులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలి.
-మంత్రి జగదీశ్ రెడ్డి
మంత్రి జగదీశ్రెడ్డి
భక్తుల కోరికలు తీర్చే చెర్వుగట్టు క్షేత్రం పరమ పవిత్రమైనదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం ఆలయ బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వరాష్ట్రంలోనే దేవాలయాలు అభివృద్ధి చెందాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో గ్రామీణ దేవాలయాలకు ధూప, దీప నైవేద్యాల కోసం నిధులు కేటాయించారని తెలిపారు. మహిమాన్విత క్షేత్రమైన చెర్వుగట్టుకు జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు, దేవాలయ సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేయాలని, భక్తులకు సరైన వసతులు కల్పించాలని ఆదేశించారు.