నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న పురాతన కొండచెలిమె బావి కొత్తందాలు సంతరించుకున్నది. పూర్వం నుంచి నీలగిరి ప్రజలకు పరిశుభ్రమైన, రుచికరమైన తాగునీటిని అందించిన ఈ బావిని సమైక్య పాలనలో ఎవరూ పట్టించుకోలేదు. బావి చుట్టూ పిచ్చి మొక్కలు, కంపచెట్లు అల్లుకుపోవడంతో తాగునీరు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బంది పడేవారు.
స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం గుర్తించి రూ.13 లక్షలు వెచ్చించి బావిని పునరుద్ధరించింది. బావి చుట్టూ ఫ్లాట్పాం కట్టించి మొక్కలు నాటించడమే కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. పునరుద్ధరించిన ఈ బావిని మంగళవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రారంభించారు. బావి పునరుద్ధరణపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పట్టణంలోని పూల్ వద్ద రూ.4.37 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.