నీలగిరి, నవంబర్ 15 : మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మఒడి-కేసీఆర్ కిట్ పథకానికి జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. ఈ పథకం ఆడబిడ్డలకు వరంగా మారడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు గర్భిణులు క్యూ కడుతున్నారు. మగ శిశువు పుడితే రూ.12 వేలు, ఆడశిశువు జన్మిస్తే రూ.13 వేల నగదు, తల్లీబిడ్డల సంరక్షణకు 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ ఇస్తుండడంతో సర్కారు దవాఖానలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు.
దాంతో ప్రవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య తగ్గి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో గణనీయంగా పెరిగింది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలో 1,60,139 ప్రసవాలు జరిగితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,15,883 ప్రసవాలు జరుగగా, పైవేట్ ఆస్పత్రుల్లో 44,256 ప్రసవాలు మాత్రమే జరిగాయి. కేసీఆర్ కిట్ పథకం లేకముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం 23 శాతమే ప్రసవాలు జరుగగా, ప్రస్తుతం 72.36 శాతానికి పెరిగింది. కేవలం 27.64 శాతం మాత్రమే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి 72,695 కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. అలాగే అమ్మఒడి కింద రూ.90 కోట్ల నగదు వారి ఖాతాల్లో జమ చేశారు. వీరిలో ఉద్యోగస్తులు, ధనవంతులు కూడా ఉండడం విశేషం.
రాష్ట్రంలో మాతా శిశు మరణాలను అరికట్టడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయించుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2017 జూన్ 3న కేసీఆర్ కిట్ను ప్రారంభించింది. ఆరేండ్లుగా ఈ పథకం సత్ఫలితాలిస్తున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించేందుకు మహిళలు గర్భం దాల్చిన వెంటనే ఆన్లైన్లో రిజిస్టర్ చేయించుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1,70,129 వరకు గర్భిణులు ఆన్లైన్లో నమోదు చేసుకోగా, అందులో 1,60,139 మందికి ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరిగాయి.
ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా 16 రకాల వస్తువులను అందజేస్తుండడంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. జిల్లా కేంద్ర దవాఖానలో అత్యధికంగా ప్రసవాలు జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకం ద్వార ఆర్థికంగా అదుకోవడంతోపాటు పుట్టిన బిడ్డను కాపాడుకునేందుకు, అనారోగ్యం బారిన పడకుండా చూసుకునేందుకు ఇస్తున్న వస్తువులు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడితో సర్కారు దవాఖానలపై ప్రజలకు భరోసా పెరిగింది. దాంతో ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
కేసీఆర్ కిట్తో జిల్లా కేంద్ర దవాఖానతోపాటు పీహెచ్సీల్లో సైతం పెద్దఎత్తున ప్రసవాలు జరగుతున్నాయి. జిల్లాలో 35 పీహెచ్సీలు ఉండగా, అందులో 18(24 గంటల) ఆరోగ్య కేంద్రాలు, 257 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఒక సీహెచ్సీ, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ఆధీనంలో జిల్లా కేంద్ర దవాఖాన, 3 ఏరియా ఆస్పత్రులు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రజావైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు జిల్లాలో కొత్తగా 195 పల్లె దవాఖానాలు, 7 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు. ఫలితంగా సిజేరియన్ల సంఖ్య తగ్గి సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగింది.
2016లో 4,719 మంది గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే కేవలం 566 సాధారణ ప్రసవాలు, 4,153 సిజేరియన్లు జరిగాయి. అదే ప్రైవేట్ ఆస్పత్రుల్లో 15,800 మందిలో 790 సాధారణ ప్రసవాలు కాగా, 15,010 సిజేరియన్లు జరిగాయి. ఈ సంవత్సరం 10,187 మంది ప్రభుత్వ ఆస్పత్రికి రాగా 8,590 సాధారణ ప్రసవాలు జరుగగా వీటిలో 1,597 సిజేరియన్లు జరిగాయి. 11,276 మంది గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు రాగా, అందులో 6, 220 సాధారణ ప్రసవాలు కాగా, 5,059 మందికి సిజేరియన్లు జరిగాయి.
కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలతో గర్భిణులంతా ప్రభుత్వ దవాఖానలకే క్యూ కడుతున్నారు. పథకాలతోపాటు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడం, మౌలిక వసతులు కల్పించడంతో ఇక్కడికే వస్తున్నారు. జిల్లాలో గర్భిణులుగా నమోదైన వారిలో దాదాపు 72.36 శాతం మంది ప్రభుత్వ దవాఖానలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం ప్రకటించక ముందు జిల్లాలో 2016లో 21,519 మంది మహిళలు గర్భం దాల్చితే వారిలో 4,719 మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చారు. 15,800 మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం కోసం వెళ్లగా, మిగతావారు ఇంటి వద్దనే ప్రసవించారు. కేసీఆర్ కిట్ వచ్చిన తరువాత ఈ సంవత్సం జిల్లాలో 21,265 మంది గర్భం దాల్చితే 14,810 మంది(72.36 శాతం) ప్రభుత్వ ఆస్పత్రులకు రాగా, కేవలం 27.64 శాతం మాత్రమే ప్రైవేట్ దవాఖానలకు వెళ్లారు.