నీలగిరి, ఫిబ్రవరి 17: నల్లగొండ జిల్లా మీదుగా హైదరాబాద్కు గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీస్ అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 284 కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కె.అపూర్వరావు వెల్లడించారు. తమిళనాడు చెందిన శక్తితనిగైరాజ ఆంధ్ర ప్రదేశ్లోని నర్సీపట్నంలో వీరబాబు, కృష్ణ వద్ద గంజాయి కొనుగోలు చేసి తమిళనాడుకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో బొలపల్లి టోల్ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా టోల్గేట్ ఢీ కొట్టి అనంతరం దారి మళ్లించి మాచర్ల మీదుగా సాగర్లోకి ప్రవేశించాడు. అక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారి నుంచి తప్పించుకుని వేగంగా వెళ్లాడు. ఈ క్రమంలో సుమారు 20 నిమిషాల పాటు వెంబడించి పెద్దవూర వద్ద పట్టుకోగా వాహనంలో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 142 ప్యాకెట్లు(ఒక్కొక్కటి 2 కిలోలు) స్వాధీనం చేసుకొని అతడిని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు.సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, సీఐ నాగరాజు, పెద్దవూర ఎస్ఐ పరమేశ్, హెచ్సీ కె.శంకర్బాబు, పీసీ కిషన్, హెచ్జీ మట్టయ్య ఉన్నారు.