రామగిరి, మార్చి 7: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శివాలయాల్లో ఉత్సవ శోభ నెలకొంది. ఆలయాలు శోభాయమానంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలు, రంగులతో శివాలయాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడనుండగా.. అందుకు తగట్టే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలకు సిద్ధం చేశారు. క్యూలైన్లు, భక్తుల కోసం మంచినీటి సౌకర్యం, షామియానాలు చలువ పందిళ్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, వాడపల్లి, మట్టపల్లి శివాలయాలు, పిల్లలమర్రి ఆలయాలు, చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరాలయం, మేళ్లచెరువు స్వయంభు శంభులింగేశ్వరాలయం, సోమప్ప సోమేశ్వరాలయం వంటి ప్రముఖ ఆలయాలకు పెద్దఎత్తున భక్తులు తరలిరానుండడంతో ప్రత్యేక శ్రద్ధ వహించారు. పానగల్ ఆలయాలకు నల్లగొండ పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ట్రస్మా ఆధ్వర్యంలో ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. పండ్లు, పూలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో భువనగిరి పట్టణంతోపాటు, ఆలేరు, చౌటుప్పల్లోని మార్కెట్లు సందడిగా మారాయి. ఉపవాసాల నేపథ్యంలో భక్తులు పండ్లను కొనుగోలు చేస్తుండగా, వ్యాపారులు పండ్ల ధరలు అమాంతం పెంచేశారు.