రామగిరి, జనవరి 18 : 2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18నుంచి ఫిబ్రవరి 6వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. 5వ తరగతిలో కొత్త సీట్లకు, 6, 7, 8 తరగతుల్లో (కేవలం మైనారిటీ) ఖాళీలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో బాలికలు, బాలురు సీట్ల కోసం ఇదే తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షలకు మించరాదు. సీట్లను లక్కీ డిప్ పద్ధతిలో ఎంపిక చేసి ప్రవేశాలు కల్పిస్తారు. సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్లోని హెల్ప్ లైన్ కేంద్రం 040-23437909 ఫోన్ నంబర్కు చేయవచ్చు. http://tmreis. telan gana.gov.in వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నల్లగొండ బాలుర పాఠశాల 9490895916, దేవరకొండ బాలుర 7331170859, నల్లగొండ జూనియర్ కళాశాల 99597 09588, నకిరేకల్ పాఠశాల 72079 98960 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని నల్లగొండ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి టి.విజయాందర్రెడ్డి, ఆర్సీఓ విష్ణు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
బాలికల కోసం హుజూర్నగర్, కోదాడ, నల్లగొండ, ఆలేరు, మిర్యాలగూడ, నకిరేకల్, బాలుర కోసం నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, చౌటుప్పల్, దేవరకొండ, తుంగతుర్తి, అనుముల పాఠశాలలు ఉన్నాయి. ఐదో తరగతిలో మైనారిటీ విద్యార్థులకు 60, బీసీలకు 10, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, ఓసీలకు 2, ఇంటర్ మొదటి సంవత్సరంలో మైనార్టీలకు 60, బీసీలకు 5, ఎస్సీలకు 2, ఓసీలకు 1 చొప్పున సీట్లను కేటాయించారు.