సూర్యాపేట, సెప్టెంబర్ 17 : ‘తెలంగాణలో కొంత మంది అపోహాలు సృష్టించి పాత గాయాలను రగిలించి ఇక్కడి సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారు. కేవలం ఓట్ల కోసం మాట్లాడి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజాస్వామికంగా తిప్పికొడుతారు.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట సమీకృత కలెక్టరేట్లో ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను మంత్రి ఎగురవేసి అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామికంగా ముందుకుపోతూ దేశంలో హైదరాబాద్కు, తెలంగాణకు ఉన్న పేరును నిలబెడుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు. ఒకరి సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించుకోవడం, పరమత సహనాన్ని పాటించడం ఇక్కడి సంప్రదాయమని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడి ప్రజలందరూ కలిసి ఉంటారని, కుట్రలు చేస్తే తిప్పికొడుతారని హెచ్చరించారు.
నాటి హైదరాబాద్ సంస్థానం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో విముక్తి చెందిందన్నారు. విసునూర్ గ్రామంలో చిట్యాల ఐలమ్మ చేసిన పోరాటంతో మొదలై దొడ్డి కొమురయ్య అమరత్వంతో జ్వాలగా రగిలి తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం నాయకత్వంలో ప్రజలందరూ ఐక్యంగా వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేశారన్నారు. భూస్వాముల దోపిడీ నశించాలని, రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టాలని జరిగిన తిరుగుబాటులో వేలాది మంది రైతులు ఆయుధాలు ధరించి పోరాటం చేశారని గుర్తు చేశారు.
ఈ పోరాటానికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందన్నారు. వారి పోరాటంతో స్వేచ్ఛ పొందిన తెలంగాణ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో కలిసిందని చెప్పారు. భారతదేశంలో విలీనం కావడం వల్ల నేడు అందరం సురక్షితంగా ఉన్నామన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారని తెలిపారు.
త్యాగాల ఫలితంగానే..
అనేక వ్యూహాలు, పోరాటాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో విలీనమైందని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రాంతం రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామిక దశలోకి పరివర్తన చెందిందని తెలిపారు. నాడు జరిగిన ప్రజా ఉద్యమం తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయిందన్నారు. ఎందరో పోరాట యోధులు ఈ ప్రాంత విముక్తి కోసం ప్రాణాలను అర్పించారని, నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో నాడు చిరస్మరణీయులైన వీరయోధులందరినీ తలుచుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు.
ఎందరో అమరుల త్యాగ ఫలితంగా ఏర్పాటైన నాటి తెలంగాణను 1956లో ఇక్కడి ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రాలో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ.. దశాబ్ద కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడినా నాటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా సాచివేత ధోరణి అవలంబించిందన్నారు. సమైక్య రాష్ట్రంలో అన్ని రంగాల్లో దారుణమైన వివక్ష కొనసాగిందని, దీంతో స్వరాష్ట్ర ఆకాంక్ష బలపడుతూ వచ్చిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధన మలి దశ ఉద్యమాన్ని నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో ఉధృతం చేసి స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన అనతి కాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిక్సూచిగా మార్చారని తెలిపారు. విద్యుత్, తాగు, సాగునీరు, వ్యవసాయం, ప్రజాసంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ రాష్ట్రంతోపాటు సూర్యాపేట జిల్లా ముందంజలో ఉన్నాయన్నారు.
ఎన్నో అవార్డులు, రివార్డులు
దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణ అభివృద్ధిని పరిశీలిస్తున్నాయని.. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రగతితో ఎన్నో అవార్డులు, రివార్డులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, అనేక గురుకుల పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించి నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి గణనీయ ప్రగతిని సాధిస్తున్నామని తెలిపారు. రాష్ర్టాన్ని దేశానికి అన్నంపెట్టే స్థాయికి తీసుకెళ్లామని చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతోపాటు గృహాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు.
15 పంచాయతీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ – 2023లో భాగంగా జిల్లా స్థాయిలో ఎంపికైన 15 గ్రామ పంచాయతీలకు మంత్రి జగదీశ్రెడ్డి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పొనుగోడు, గణపవరం, వెంపటి, ఏపూరు, గానుగుబండ, పాతర్లపహాడ్, గుంపుల తిరుమలగిరి, అనంతారం, సిరికొండ, తుమ్మలపల్లి, రెడ్డిగూడెం, వేల్పుల సింగారం, కొండాపురం, రెడ్లకుంట, శ్రీరంగాపురం గ్రామాల సర్పంచులు, కార్యదర్శులను సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు ప్రియాంక, వెంకట్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ సీఈఓ సురేశ్, డీపీఓ యాదయ్య, డీఆర్డీఓ కిరణ్కుమార్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.