మునుగోడు, సెప్టెంబర్ 09 : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన మహోత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈ నెల 10 చాకలి ఐలమ్మ వర్ధంతి నుండి 17 వరకు జరిగే వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సీహెచ్ లక్ష్మీనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సీపీఎం మునుగోడు నియోజకవర్గ స్థాయి స్టడీ సర్కిల్ నాంపల్లి చంద్రమౌళి అధ్యక్షతన స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించగా వారు హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో, నిజాం పాలనలో జరుగుతున్న దోపిడీ, పీడన, వెట్టిచాకిరి, దొరలు, జమీందారులు, జాగీర్దారులకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర పోరాటంలో కమ్యూనిస్టు యోధులు అనేక త్యాగాలు చేసి ప్రజలకు అండగా నిలబడినట్లు తెలిపారు. ఈ పోరాటం ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, 3 వేల గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయని, వెట్టిచాకిరి రద్దు చేయబడిందని, జమీందారులను గ్రామాల నుండి తరిమికొట్టారన్నారు.
ఇలాంటి మహత్తర పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజల పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఆ పోరాటంలో అనేకమంది ముస్లింలు ముగ్దీమ్ మోయీద్దీన్, సోయబుల్లా ఖాన్, షేక్ బందగి తదితరులు నిజాం పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కర్నాటి మల్లేశం, మునుగోడు, మర్రిగూడ, చండూరు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, ఏర్పుల యాదయ్య, జెరిపోతుల ధనంజయ్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, పగడాల కాంతయ్య, ముత్తిలింగం, కర్నాటి వెంకటేశం, కర్నాటి సుధాకర్, వల్లూరి శ్రీశైలం, అచ్చిని శ్రీను, మాలిగా శివ, పర్సనగోని యాదగిరి, రామలింగాచారి, కొత్తపెళ్లి నరసింహ, యాట గణేష్ పాల్గొన్నారు.