దామరచర్ల, మార్చి 5 : నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు పంటలు నష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. యాసంగిలో సాగు చేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. దాంతో రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోగా రైతు కూలీలకు పనులు లేకుండా పోయాయి. దాంతో ఆంధ్రా, ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లే దుస్థితి దాపురించింది.
దామరచర్ల మండలంలో యాసంగిలో బోర్లకింద వరి, పత్తి, మిర్చి, జొన్న పంటలు వేశారు. పంటలు చేతికొచ్చే సమయానికి భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయడం లేదు. దాంతో కొంత మంది రైతులు అప్పులు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నారు. 400 ఫీట్లు వేసినా నీళ్లు పడటం లేదు. మండలంలోని దామరచర్ల, నర్సాపురం, బొత్తలపాలెం, కల్లేపల్లి, తిమ్మాపురం, వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, ఇర్కిగూడెం, వాడపల్లి, కేశవాపురం పరిసర గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. మండలంలో బోర్లకింద 9వేల ఎకరాలు వరిసాగు చేయగా వెయ్యి ఎకరాల్లో మాత్రమే పంట చేతికందే అవకాశం ఉన్నది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. నీళ్లు లేక ఎండిన వరి పంటను చేసేదేమీ లేక పశువుల మేతకు ఇచ్చేస్తున్నారు. పత్తి, మిర్చి, జొన్న పంటలు కూడా ఎండిపోయాయి. బత్తాయి, ఆయిల్ పామ్ తోటలకు నీరులేక పోవడడంతో ట్యాంకర్లతో నీటిని అందించి కాపాడుకుంటున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దామరచర్ల మండలంలో పంటలు ఎండిపోవడం తో స్థానికంగా రైతులకు పనులు లేకుండా పోయా యి. దాంతో ఆంధ్రాలో పత్తి, మిర్చి పంట ఏరేందుకు కూలీలుగా వెళ్తున్నారు. మండలం నుంచే కాకుండా నిడమనూరు, త్రిపురారం, వేములపల్లి, మిర్యాలగూడ పరిసర ప్రాంతాల నుంచి నిత్యం ఆటోలు, డీసీఎంలలో వెళ్తున్నారు. గతంలో వర్షా లు సమయానికి పడి, చెరువుల్లో నీరు ఉండటంతో రెండుకార్లు పంటలు మంచిగా పండేవి. రైతులు, రైతు కూలీలకు స్థానికంగానే పనులు ఉండేవి. ప్రస్తుతం కరువు కారణంగా కూలి కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. గతంలో ఎన్నడూ వెళ్లని రైతులు, కూలీలు నేడు ఆర్థిక పరిస్థితులు బాగాలేక కూలికి వెళ్తున్నట్లు తెలిపారు.