సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 15 : ఐక్యతతోనే అన్ని రంగాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కులమతాలకతీతంగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రంజాన్ పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మెహరాజ్ మసీద్ వద్ద ముస్లింలకు మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి పలువురు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని మతాల పండుగలను ప్రశాంతవాతావరణంలో సంబురంగా జరుపుకుంటున్నారని, సీఎం కేసీఆర్ వచ్చిన తరువాతనే రంజాన్ పండుగతోపాటు అన్ని మతాల ప్రధాన పండుగలకు ప్రభుత్వ గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచే యావత్ దేశంలో మరెక్కడా లేని విధంగా కులమతాలు, రాజకీయాలకతీతంగా పాలన కొనసాగుతుందన్నారు.
సర్వమత సమ్మేళనాలకు తెలంగాణ కేంద్ర బిందువుగా మారిందని, అందరి ఆకలి తీర్చేందుకు సాహసోపేతంగా సంచలనాత్మకమైన నిర్ణయాలకు సీఎం కేసీఆర్ కేరాఫ్గా నిలుస్తున్నారన్నారు. తొమ్మిదేండ్లుగా అన్ని మతాల పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొంటునట్లు తెలిపారు. పేదలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందకు ప్రభుత్వం వినూత్న రీతిలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నదన్నారు. గతంలో మైనార్టీలను ఏ ప్రభుత్వమూ గుర్తించలేదని, ఉమ్మడి పాలనలో మైనార్టీలు ఎదుర్కున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదని గర్తు చేశారు. ఆ కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పెద్దగా ఆలోచించి మైనార్టీ నిరుపేదలకు రంజాన్ తోఫా అందిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఐక్యత పెంచుకుంటూ మరింత అభివృద్ధి సాధించుకుందామన్నారు. కౌన్సిల్ తాహెర్పాషా, గుర్రం ప్రకాశ్రెడ్డి, గుండపునేని కిరణ్, రియాజుద్దీన్, సయ్యద్, డాక్టర్ జహీరుద్దీన్, గౌస్ఖాన్, గౌసుద్దీన్, జాకీరుద్దీన్, జానీ, షాహిద్, యాకూబ్, అబ్బాస్, ముజాహిద్, ఫారుక్, పగిళ్ల శేఖర్ పాల్గొన్నారు.