తరతరాలుగా నల్లగొండ జిల్లాకు పట్టిన ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టి, ఇంటింటికీ శుద్ధి చేసిన మంచి నీరు అందించి అడబిడ్డల కష్టాన్ని తీర్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మిర్యాలగూడ మండలం అవంతీపురంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిర్వహించిన మంచినీళ్ల పండుగలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనంతో కలిసి ప్లాంట్ను సందర్శించారు. అనంతరం జరిగిన సభలో గుత్తా మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులు, చెక్డ్యామ్ల నిర్మాణంతో సాగు, తాగు నీటి ఇబ్బందులు తీరాయని తెలిపారు.
– మిర్యాలగూడ రూరల్,
జూన్18 మిర్యాలగూడ రూరల్, జూన్ 18 : సాగు, తాగునీరు అందివ్వడంలో సఫలమైన సీఎం కేసీఆర్ అపర భగీరథుడని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అవంతీపురం వాటర్ గ్రీడ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ఆదివారం నిర్వహించిన మంచినీళ్ల పండుగలో ఆయన మాట్లాడారు. తరతరాలుగా నల్లగొండ జిల్లాకు పట్టిన ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టి ఆడబిడ్డల కష్టాన్ని తీర్చేందుకు ఇంటింటికీ శుద్ధి చేసిన నీళ్లు అందించిన ఘనుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తాగు, సాగునీటికి నోచక కరువు తాండవించేదన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో పాదయాత్ర ద్వారా కరువు పరిస్థితులను తెలుసుకున్న కేసీఆర్ మన నీళ్లు మనకు నినాదంతో ముందుకు సాగి రాష్ర్టాన్ని సాధించారని తెలిపారు. స్వరాష్ట్రంలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, చెక్డ్యామ్లు, ఎత్తిపోతల పథకాలను నిర్మించి బీడు భూములను సస్యశ్యామలం చేశారన్నారు. దాంతో పంట దిగుబడిలో దేశంలోనే రాష్ట్రం రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. వ్యవసాయంతోపాటు పారిశ్రామిక, విద్య, విద్యుత్ ఉత్పత్తి, అన్ని రంగాల్లోనూ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
మిర్యాలగూడకు కోటి లీటర్ల తాగునీరు
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు
మిర్యాలగూడ పట్టణానికి మిషన్ భగీరథ ద్వారా కోటి లీటర్ల తాగునీరు సరఫరా చేస్తున్నామని, పెద్దదేవులపల్లి చెరువు నుంచి రెండో పైపులైన్ వేసి మరో కోటి లీటర్లు సప్లయ్ చేస్తామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, తండాల్లోని ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, ఆర్డీఓ చెన్నయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ నూకల సరళ, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, దామరచర్ల జడ్పీటీసీ హతీరాం నాయక్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ సంపత్కుమార్, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, వైస్ ఎంపీపీలు అమరావతి సైదులు, గోవర్ధని, సర్పంచులు బోగవల్లి వెంకటరమణ చౌదరి, చౌగాని భిక్షంగౌడ్, వెంకన్న, గజ్జెల కోటిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదయ్య యాదవ్, నాయకులు పాల్గొన్నారు.