సూర్యాపేట అర్బన్, ఏప్రిల్ 14 : తల్లిదండ్రులు లేని అనాథలు, ఎలాంటి ఆధారం లేని అభాగ్యులైన పిల్లలకు చేయూత ఇచ్చి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్యను అమలు చేస్తున్నది. స్త్రీ, శిశు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వారా అనాథ పిల్లలకు సర్కారు ప్రతినెలా రూ.4 వేలు అందించనున్నది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అర్హులైన వారి నుంచి శిశు సంక్షేమ శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
స్త్రీ,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులను అధికారులు ఎంపిక చేయనున్నారు. అనాథ పిల్లల విద్య, వైద్య, అభివృద్ధి అవసరాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తున్నది. నిరాదరణ, పేదరికం కారణంగా పిల్లలు చదువుకు దూరం కావద్దన్న సంకల్పంతో ఈ పథకం ప్రారంభించింది. అర్హులైన వారు స్థానిక అంగన్ వాడీ సెంటర్ ద్వారా జిల్లా సంక్షేమ శాఖ లేదా బాలల పరిరక్షణ విభాగం అధికాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రూ.4 వేల ఆర్ధికసాయం
ఈ పథకం ద్వారా బాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60-40శాతం భాగస్వామ్యంతో ఆర్థిక సాయం అందించనున్నాయి. ప్రతి నెలా రూ.4వేల చొప్పున ఇస్తారు. ఈ పథకం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్నది. ఏదైనా వసతి గృహం, బాల సదనంలో చేర్పించిన పిల్లలు ఆర్థిక సాయానికి అర్హులు కారు. ఈ పథకం ద్వారా ఎంపికైన పిల్లలు తప్పని సరిగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సి ఉంటుంది.
కావాల్సిన ధ్రువపత్రాలు
ఈ పథకానికి దరఖాస్తు చేసుకొనేందుకు బాలుడు, బాలిక బర్త్ సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, కుల ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, మరణ ధ్రువీకరణ పత్రాలు, ప్రభత్వ పాఠశాలల్లో చదవుతున్న స్టడీ సర్టిఫికెట్ను దరఖాస్తు వెంట జతచేయాలి.
జిల్లాలో 491 మంది గుర్తింపు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 491 మంది అనాథ పిల్లలను గుర్తించారు. ఇందులో ఇప్పటికే 41 మంది బాలలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వ సాయం అందుతుండగా మిగిలిన 450 మందికి సంబంధించిన సమాచారం సేకరించారు. ప్రభుత్వం నుంచి రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు రాగానే మిగిలిన బాలలకు సాయం అందించనున్నారు.
తల్లి దండ్రులు లేని పిల్లలకు పథకం వర్తింపు
మిషన్ వాత్సల్య పథకం ద్వారా జిల్లాలో తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆర్థిక సాయం అందుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేరుతున్నది. ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు మాత్రమే అర్హులను ఎంపిక చేస్తారు. అనాథ పిల్లలు ఉంటే స్వయంగా మా సిబ్బంది వెళ్లి వివరాలను సేకరించి ప్రభుత్వ సాయం అందిస్తారు.
– జ్యోతి పద్మ (జిల్లా స్త్రీ,శిశు , సంక్షేమ శాఖ అధికారి -సూర్యాపేట)