చివ్వెంల, ఏప్రిల్ 17 : సమైక్య రాష్ట్రంలో కునారిల్లిన కుల వృత్తులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాణం పోస్తున్నది. ఒక్కో కుల వృత్తికి జీవం పోస్తూ ఆయా కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నది. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్లకు ఉచితంగా చేప పిల్లలు, వాహనాలు, దళితులకు దళిత బంధు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. రజకులు, నాయీ బ్రాహ్మణులకు అండగా ఉండేందుకు 250యునిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు కాగా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4,225 లబ్ధి చేకూరింది. ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు రూ.2.51కోట్ల సబ్సిడీతో ఉచిత విద్యుత్ యూనిట్ల బిల్లులు చెల్లించింది.
గ్రామీణ ప్రాంతాల్లో రజకులు, నాయీ బ్రాహ్మణులు ఎక్కువగా కుల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ రెండు వర్గాల ప్రజలు మారుతున్న కాలానికి ఆధునిక పద్ధతిలో వృత్తిని కొనసాగిస్తున్నారు. దీంతో వారిపై ఆర్థిక భారం అధికంగా పడుతున్నది. మోడ్రన్ సెలూన్లు, దోబీఘాట్లు వస్తుండడంతో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ ఈ రెండు వర్గాల ప్రజలకు అండగా నిలువాలని నిర్ణయించారు. అందులో భాగంగానే 2021-22 ఆర్థిక సంవత్సరంలో నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచితంగా 250 విద్యుత్ అందించాలని పథకాన్ని రూపొందించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎలాంటి షరతులు, దళారుల ప్రమేయం లేకుండా ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ సంతోషంగా వృత్తులను కొనసాగిస్తున్నారు.
రూ.2.51 కోట్ల సబ్సిడీ
చేతులతో బట్టలు ఉతకడం, బొగ్గులతో ఇస్త్రీ చేస్తున్న రజకులు మారుతున్న కాలానుగుణంగా వారు మారాల్సి వచ్చింది. మోడ్రన్ లాండ్రీ షాపులు, విద్యుత్తో నడిచే ఇస్త్రీ పెట్టెలు పెట్టి నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోడ్రన్ షాపులు పెట్టుకోవడం ఆర్థిక భారంగా మారితే వాటిని నడపడానికి సైతం భారంగా మారిపోయింది. నెలనెలా కరెంట్ బిల్లులు ఆర్థిక భారంగా మారిపోయాయి. దీంతో ఉచితంగా 250యూనిట్లు సబ్సిడీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా లాండ్రీ, ఇస్త్రీ షాపులకు నెలకు 250యూనిట్ల ఉచిత విద్యుత్ తీసుకొచ్చింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 3,376మంది లబ్ధిదారులు ఈ పథకంలో ఉచిత విద్యుత్ పొందుతున్నారు. మోడ్రన్ సెలూన్లు నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులకు సైతం ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 849మంది లబ్ధిదారులకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. రెండు వృత్తులు కలిపి 4,225మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2.51కోట్ల సబ్సిడీ ఇచ్చింది.
విద్యుత్ భారం తప్పింది
గతంలో ఏ ప్రభుత్వాలూ కుల వృత్తులను ఆదరించలేదు. ప్రస్తుతం అన్ని కుల వృత్తుల వారికి సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారు. మా సెలూన్ షాపులో కరెంట్కు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీతో మా పై భారం తప్పింది. గతంలో బేరాలు ఉన్నా, లేకున్నా విద్యుత్ బిల్లులు, ఇతర ఖర్చులు తప్పేవి కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ చార్జీలు కట్టాల్సిన పని లేకుండా పోయింది. కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న మాకు ప్రభుత్వం అండగా నిలువడం సంతోషంగా ఉంది. మా కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం పది కాలాలు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం.
– శ్రీరాముల జానయ్య, హెయిర్ సెలూన్ నిర్వాహకుడు, చివ్వెంల
సీఎం కేసీఆర్ పాలనలోనే నాయీ బ్రాహ్మణులకు గుర్తింపు
సీఎం కేసీఆర్ పాలనలోనే నాయీ బ్రాహ్మణులకు గుర్తింపు లభించింది. గతంలో విద్యుత్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడ్డాం. ఏడాదిన్నర నుంచి సెలూన్లకు సీఎం కేసీఆర్ 250యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. 24గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నారు. సీఎం కేసీఆర్కు నాయీ బ్రాహ్మణులందరం రుణపడి ఉంటాం.
– మేడిపల్లి వినయ్కుమార్, సెలూన్ షాపు నిర్వాహకుడు, నూతనకల్