చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత అండగా నిలుస్తున్నది. ఇప్పటికే అనేక విధాలుగా ఆదుకుంటున్న సర్కారు.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అమలవుతున్న చేనేత మిత్ర పథకాన్నికొన్ని మార్పులు చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా కార్మికులకు నెలకు రూ.3వేల ఆర్థిక సాయం అందిస్తున్నది. శుక్రవారం నుంచి నేతన్నల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. తొలి రోజు జిల్లాలో సుమారు 2 వేల మందికి బ్యాంక్ అకౌంట్లలో నగదు పడింది. ఇప్పటి వరకు నూలు, రసాయనాలు, ముడి సరుకుల కొనుగోలుపై ప్రభుత్వం 40 సబ్సిడీ ఇస్తుండగా దానికి బదులు నేరుగా రూ.3 వేలు ఇస్తున్నది. ఇటీవల రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కేటీఆర్ చెప్పినట్లు ఒకటో తేదీ నుంచి పథకం అమల్లోకి రావడంతో చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నల బతుకులు అస్తవ్యస్తంగా ఉండేవి. సర్కారు తోడ్పాటు లేక కుటుంబ పరిస్థితి దుర్భరంగా మారి జీవితం వెల్లదీయడమే కష్టంగా ఉండేది. చేతిలో పనిలేక, ఉపాధి కరువై అప్పుల పాలయ్యేవారు. తెచ్చిన అప్పులు, మిత్తీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల బతుకులు మారాయి. ప్రభు త్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. నేతన్నలకు పొదుపు పథకం, పింఛన్లు, రాయితీలు, పావలా వడ్డీ రుణ మాఫీ, ఆధునిక ఆసు యంత్రాల పథకం, నేతన్నకు బీమా పథకాలను అమలు చేస్తున్నది.
బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ..
ఇటీవల రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కేటీఆర్ చెప్పినట్లు ఈ నెల 1 నుంచి మార్పు చేసిన పథకం అమల్లోకి వచ్చింది. శుక్రవారం నుంచి నేత కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. ఒక్కో కుటుంబానికి రూ.3వేలు అందుతున్నాయి. జిల్లాలో మొత్తం 10,600 మంది అర్హులు ఉండగా, తొలి రోజు సుమారు రూ.2వేల మందికి పైగా ఆర్థిక సాయం బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యింది. మొత్తం రూ.3వేలలో రూ.2వేలు నేత కార్మికుడికి, వెయ్యి అనుబంధ కార్మికుడి(భార్య లేదా కుటుంబ సభ్యులు) ఖాతాల్లో పడుతున్నాయి. ఒక వేళ అనుబంధ కార్మికులు ఇద్దరు ఉన్నట్లయితే ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున జమ అవుతున్నాయి. ఆధార్ కార్డు లింక్ చేసుకున్న వారికి విడుతల వారీగా జమ కానున్నాయి.
నెలకు రూ.3వేలు..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేనేత మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నది. అయితే ఈ పథకం కింద నూలు, రసాయనాలు, ముడి సరుకులకు సబ్సిడీ ఇస్తున్నది. నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై 40శాతం సబ్సిడీ కల్పిస్తున్నది. ఈ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 38 కోట్లు చేనేత కార్మికులకు అందాయి. అయితే సబ్సిడీ పొందడం నేతన్నలకు ఇబ్బందిగా మారుతున్నది. జీఎస్టీ బిల్లులు, ఆన్లైన్లో దరఖాస్తు తదితర విధానంతో సబ్సిడీ పొందలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో మార్పు చేసింది. ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన సబ్సిడీకి స్వస్తి చెప్పింది. అర్హులైన నేతన్నలకు రూ. 3వేల సా యం చేయాలని నిర్ణయించింది. పథకం పేరును మాత్రం మార్చకుండే అలాగే కొనసాగిస్తున్నది.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడుతుంది. గతంలో చేనేత కార్మికుల బతుకులు దుర్భరంగా ఉండేవి. చేనేత మిత్ర పథకం ద్వారా కార్మికుల ఖాతాల్లో రూ.3వేలు పడుతున్నాయి. చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటుకు రుణపడి ఉంటాం.
– ఆడెపు బాలస్వామి, చేనేత కార్మికుడు, ఆలేరు
నేతన్నలకు కొండంత అండగా కేటీఆర్
రాష్ట్ర ఏర్పడిన తర్వాత నేతన్నలకు సహకార రంగం, సహకారేతర రంగాల్లో ఉన్నవారికి ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకోరుతుంది. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు పడ్డ విధంగా నేత కార్మికులకు కూడా మూడు వేల రూపాయలు అకౌంట్లో జమవుతున్నాయి. చేనేత మిత్ర పథకం ప్రవేశపెట్టిన కేటీఆర్ గారికి చేనేత కార్మికులు అందరి తరపున కృతజ్ఞతలు.
– బొల్ల శివశంకర్, అఖిలభారత పద్మశాలీ రాజకీయ విభాగం అధ్యక్షుడు
ఆధార్ లింక్ తప్పనిసరి
చేనేత మిత్ర కొత్త పథకం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. అర్హులైన నేత కార్మిక కుటుంబానికి రూ.3వేలు అందుతున్నాయి. కార్మికుడికి రెండు వేలు, అనుబంధ కార్మికుడికి వెయ్యి బ్యాంక్ ఖాతాల్లో వేస్తున్నారు. తొలి రోజు సుమారు 2వేల మందికి దాకా డబ్బులు అందాయి. డబ్బులు జమ కావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా బ్యాంకు ఆకౌంట్తో లింక్ చేసుకోవాలి.
– విద్యాసాగర్, ఏడీ, చేనేత, ఔళిశాఖ