నేరేడుచర్ల, జనవరి 6 : దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం పట్ల మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్నగర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. మోదీ భారతదేశానికి వెలుగులు నింపుతానని చెప్పి తెలంగాణ రాష్ట్రం మినహా మిగిలిన రాష్ర్టాలన్నింటినీ చీకటిలోకి నెట్టివేశారని అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి సంవత్సరానికి రూ.6వేల కోట్ల నిధులను రెండు సంవత్సరాలుగా ఆపివేసి మోటర్లకు మీటర్లు పెట్టాలని, అప్పుడే నిధులు ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మొండి చెయ్యి చూపారని ఆరోపించారు. రైతుబంధు, ఆసరా పింఛన్లు, 24 గంటల కరంట్, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ప్రపంచం అబ్బురపడేలా మూడేండ్లలోనే కాళేశ్వరం ఎత్తి పోతల పథకం నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని మోదీ ఓర్వలేకపోతున్నారని, తన ప్రతిష్టను దిగజార్చుకుంటూ తెలంగాణపై అక్కసు గక్కుతున్నాడని విమర్శించారు.
దేశ వ్యాప్తంగా జరిగిన ఒక సర్వేలో ఒకటి నుంచి 20 వరకు ఉత్తమ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు తెలంగాణ నుంచే అవార్డులను అందుకున్న విషయం మర్చిపోరాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంపై అత్యంత సంతోషం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ వాసులేనని, మొట్ట మొదటి సారిగా బీఆర్ఎస్లోకి చేరేందుకు వారే ముందుకు వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరాయని, తాము కూడా కేసీఆర్కు బాధ్యతలు ఇస్తే బాగుపడుతామని ఏపీ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. వీరికి తోడు కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో కూడా కేసీఆర్ అభిమానులు రోజురోజుకు పెరిగిపోతున్నారని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి పక్క రాష్ర్టాల్లో ప్రజలు ప్రభుత్వాలను నిలదీస్తున్నారని, లేదంటే తమను కూడా తెలంగాణలో కలుపాలని గొడవలు చేస్తున్నారని పేర్కొన్నారు. మోదీ అరాచకాలను సహిద్దామా? లేదంటే ఢిల్లీకి వెళ్లి మన సత్తా చాటుదామా అని సీఎం కేసీఆర్ అంటున్నారని, అందుకే బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని, అందరూ కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు.