యాదాద్రి భువనగిరి, జూలై 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వచ్చే నెలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నారు. ఇందుకోసం భువనగిరిలోని ఓ హోటల్లో మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు అధ్యక్షతన యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి జిల్లాలోని ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే.. 10:30 గంటలకు సమావేశం కావాల్సి ఉండగా, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ఆలస్యంగా వచ్చారు. అప్పటికే జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ స్టేజీపైన కూర్చున్నారు. కానీ.. అక్కడే ఉన్న బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని వేదికపైకి పిలువలేదు. దాంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. సాధారణ కార్యకర్తగా కిందే ఉండిపోయారు. బంగారు శృతి వచ్చాక కూడా స్టేజీపైకి పిలువలేదు. సమావేశం ప్రారంభమైన పావుగంట తర్వాత.. జిట్టాను శృతి ఆహ్వానించారు. అయినా.. ఆయన పైకి వెళ్లకుండా అలాగే కూర్చున్నారు. ఆమె కిందికి వచ్చి స్టేజీపైకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా బాలకృష్ణారెడ్డి ససేమిరా అన్నారు. ఇప్పుడు వద్దు.. తర్వాత మాట్లాడుదామని ఆమె బతిమిలాడినా వెనక్కి తగ్గలేదు. దాంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ సమావేశం ముగిసేదాకా జిట్టా వేదికపైకి వెళ్లలేదు.
సీటుకు ఎసరు పెడుతారనేనా..?
బీజేపీలో పీవీ శ్యామ్సుందర్ ఎప్పటి నుంచో పని చేస్తున్నారు. ఇటీవల ఇతర పార్టీల నుంచి గూడూరు నారాయణరెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీలోకి వచ్చారు. అప్పటి నుంచి పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. కొత్తగా పార్టీలోకి వచ్చినవాళ్లను పట్టించుకోకుండా.. పాత వాళ్లకే ప్రియారిటీ ఇస్తున్నట్లు పార్టీలో బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పీవీ, భిక్షమయ్యగౌడ్ మాత్రం సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసింది. సన్నాహక సమావేశం కంటే ముందు కూడా పీవీ, భిక్షమయ్యగౌడ్ హోటల్లోని ఓ రూమ్లో రహస్యంగా చర్చించుకున్నట్లు తెలిసింది. వీరిద్దరివి వేర్వేరు నియోజకర్గాలు. రానున్న ఎన్నికల్లో బాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటుకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. దాంతో తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని జిట్టాకు పీవీ చెక్ పెడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సమావేశం మధ్యలో వచ్చిన గూడూరు నారాయణరెడ్డి మాత్రం వేదికపైనే కూర్చున్నారు.
కేడర్ ఆగ్రహం..
పార్టీలో కీలక నేతలకు ప్రియారిటీ ఇవ్వకుండా అవమానించడంపై కిందిస్థాయి కేడర్ అసహనం వ్యక్తం చేస్తున్నది. సన్నాహక సమావేశంలోనే కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతి అని మండిపడ్డారు. ఇప్పుడే ఇట్ల ఉంటే.. మున్ముందు ఎలా సమన్వయం చేసుకుంటారని ఫైర్ అవుతున్నారు.