కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేస్తున్నది. మన ఊరు – మన బడిలో భాగంగా అన్ని వసతులు కల్పిస్తున్నది. విద్యార్థులను చదువుతోపాటు ఆట పాటల్లోనూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నది. ఇక బడుల సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసి మరింత తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్కూళ్లకు ట్యాబ్లు అందించనున్నది. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల ప్రగతి నివేదికను ఉన్నతాధికారుల వరకు తెలుసుకోవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2,153 ట్యాబ్లు డీఈఓ కార్యాలయాలకు చేరుకున్నాయి. వాటిని భద్రపరిచి పాఠశాలలు మొదలు కాగానే ఇవ్వనున్నారు.
– రామగిరి, ఏప్రిల్ 18
రామగిరి, ఏప్రిల్ 18: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా మన ఊరు-మన బడి పథకం చేపట్టి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించింది. విద్యార్థులను చదువుతోపాటు ఆటల్లోనూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నది. ఇక బడుల సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసి మరింత తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్కూళ్లకు ట్యాబ్లు అందించనున్నది. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులకు సర్కార్ స్కూళ్లపై భరోసా పెరుగనుంది.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ట్యాబ్ల పంపిణీ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక(పీఎస్), ప్రాథమికోన్నత(యూపీఎస్) పాఠశాలలకు ట్యాబ్లు అందజేయనున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు ఉపాధ్యాయుల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వ ప్రగతి నివేదికను కోరనుంది. అందులో భాగంగా ట్యాబ్లు అందించాలని సంకల్పించింది. జిల్లాలలో ఏ పాఠశాలల ఇవ్వాలనేది నిర్ణయాలు సైతం చేసి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే జిల్లా విద్యాశాఖ- సమగ్రశిక్షకు చేరిన ట్యాబ్స్ను వేసవి సెలవుల తర్వాత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వీటిని పంపిణీ చేయనున్నారు.
నమోదు చేసే అంశాలు ఇవే..
పాఠశాల వివరాలు , విద్యార్థుల సంఖ్య, ఫేస్ రికగ్నైజ్తో అనుసంధానం చేస్తూ ఉపాధ్యాయుల హాజరు రోజు వారీగా నమోదు చేయాలి. అయితే ఇప్పటి వరకు విద్యార్థుల సంఖ్యతోపాటు ఉపాధ్యాయుల హాజరు పై దృష్టి పెట్టలేదు. ఇష్టానుసారంగా హాజరు వేసిన సందర్భాలున్నాయి. ట్యాబ్లో ఫేస్ రికగ్నైజ్తో కచ్చితమైన సమాచారం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు చేరనుంది.
ప్రత్యేక శిక్షణ తర్వాతే పాఠశాలలకు ట్యాబ్లు
ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రతి పాఠశాలలో పది మంది విద్యార్థులకంటే ఎక్కువగా ఉంటే ఒక ట్యాబ్ అందజేస్తారు. 150మందికిపైగా విద్యార్థులుంటే రెండు ట్యాబ్లు అందించనున్నారు. ట్యాబ్లను వినియోగం, వివరాలను అప్లోడ్పై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పునఃప్రారంభంకాగానే ట్యాబ్లు అందజేయనున్నారు. అయితే ప్రతి జిల్లాలో ట్యాబ్ల పంపిణీకి ఎంపికైన పాఠశాలల కంటే అదనంగా కొన్ని ట్యాబ్లను పంపించారు.
శిక్షణ తర్వాతనే ట్యాబ్లు అందజేస్తాం
రాష్ట్ర విద్యాశాఖ నుంచి జిల్లాకు 496 ట్యాబ్లు వచ్చాయి. వీటిని నిర్వహణపై రిసోర్స్పర్సన్లతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ అందజేస్తాం. ట్యాబ్లో ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలలలోని విద్యార్థుల పూర్తి సమాచారం, ప్రగతి నివేదిక నమోదు చేయాల్సి ఉంటుంది. దాంతో ఎప్పటికప్పుడు మండలం నుంచి రాష్ట్ర స్థ్ధాయి వరకు ఉన్నతాధికారుల నమోదు చేసిన సమాచారం పర్యవేక్షణ చేసే అవకాశం ఉంటుంది. పారదర్శకత పెరుగుతుంది.
– కె.నారాయణరెడ్డి, డీఈఓ, యాదాద్రిభువనగిరి