కృష్ణానదీ తీరంలో కొలువుదీరిన పంచ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైన మట్టపల్లిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దంపతులు హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాష్ట్ర నలుమూలలతోపాటు ఏపీ, తమిళనాడు నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు.
యాదగిరిగుట్ట, మే 5 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంతో పాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో శుక్రవారం స్వాతి నక్షత్ర పూజలు నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. పాలు, పెరుగు, పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామి వారిని అభిషేకించారు. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో స్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు చేశారు. అంతకుముందు స్వామికి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సుదర్శన నారసింహ హోమాన్ని పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో నిర్వహించారు. ఉదయం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శ నారసింహ హవనం నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవను చేపట్టారు.
అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరు కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ముత్తయిదువులు మంగళ హారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలలో శయనింపు చేశారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు పాడారు. స్వామి వారిని సుమారు 27వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.36,50,164 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
హైదరాబాద్లోని చైతన్యపురిలో గల శ్రీకోసగండ్ల ఫణిగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జయంత్యుత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గుట్ట ఆలయ ఈఓ ఎన్.గీత గురువారం ఉత్సవాల్లో పాల్గొని యాదగిరిగుట్ట దేవస్థానం తరపున పట్టువస్ర్తాలు సమర్పించారు.