కోదాడ టౌన్, మే 15 : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన షేక్ తాజుద్దీన్ సౌదీ అరేబియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణానికి చెందిన తాజుద్దీన్ జీవనోపాధి కోసం పదేండ్ల క్రితం సౌదీ అరేబియాలోని దమామ్ పట్టణానికి వెళ్లాడు. కారు డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి పేరు మీద లైసెన్స్ తీసుకుని తానే సొంతంగా కూరగాయల దుకాణం పెట్టుకుని నడిపిస్తున్నాడు.
కాగా బుధవారం సాయంత్రం తాజుద్దీన్ చనిపోయినట్లుగా అతడి స్నేహితులు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు తెలిపారు. తాజుద్దీన్ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే కపిల్ అనే వ్యక్తి తాజుద్దీన్ను వేధింపులకు గురిచేస్తున్నాడని, అతడే హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిరుపేద కుటుంబం కావడంతో మృతదేహాన్ని కోదాడకు తీసుకువచ్చేందుకు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు స్పందించి 9182053234 నంబర్కు ఆర్థిక సాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు.