దేశంలో ఉత్తమ వ్యవసాయ మార్కెట్గా గుర్తింపు
అవార్డు అందించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
మార్కెట్ పాలకవర్గం, అధికారులను అభినందించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
బొడ్రాయిబజార్, జూన్ 20 : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో అమలౌతున్న ఈ-నామ్ విధానం పలు రాష్ర్టాల మార్కెట్లకు మార్గదర్శంగా నిలుస్తుంది. గతంలో రైతులు మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం టెండర్లు పూర్తి అయి కాంటాలు వేసుకొని డబ్బులు తీసుకునేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతుండేది. ఈ రెండు మూడు రోజులు రైతులు మార్కెట్లో ధాన్యానికి కాపలా కాస్తూ ఉండాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితి నుంచి రైతులను బయటపడేసేందుకు దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఈ-నామ్ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం రైతులకు ఊరటనిచ్చింది. ఈ విధానంలో వ్యాపారులు ఆన్లైన్లో టెండర్లలో పాల్గొనడంతో మిలాఖత్ అయ్యేందుకు అవకాశం లేకుండా పోతుంది. దీంతో ధాన్యానికి ధర అధికంగా పలుకుతుంది. ఈ విధానంలో రైతు మార్కెట్కు ధాన్యం తెచ్చిన రోజునే టెండర్లు, కాంటాలు పూర్తి కావడంతో పాటు అదే రోజున డబ్బులు తీసుకుని ఆనందంగా ఇంటి ముఖం పడుతున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఈ-నామ్లో జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి భేష్ అనిపించుకుంటుంది.
ఈ-నామ్ అమలుతో మంచి ధర..
ఈ-నామ్ విధానంలో రైతులకు గేట్ ఎంట్రీ మొదలుకుని నాలుగు సెగ్మెంట్లుగా విభజించారు. సెగ్మెంట్కు ఒక ఇన్చార్జి, సబ్ స్టాఫ్ను నియమించి రైతులను అసైన్డ్ చేస్తారు. ఉదయం 6 నుంచి 11.30 గంటల వరకు ఈ నామ్ ప్రక్రియ ముగుస్తుంది. కొనుగోలుదారులు ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా టెండర్లు వేయడంతో పోటీతత్వం పెరిగి రైతుల ధాన్యానికి అధిక ధర పలుకుతుంది. ఈ-నామ్ అమల్లో మిల్లర్లు, కమీషన్దారులు, అడ్తిదారులు, ట్రేడర్స్, మార్కెట్ అధికార సిబ్బంది అందరిది విశేషమైన కృషిగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం యాసంగిలో 8 లక్షల 50 వేల బస్తాల ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేశారు. మాయిశ్చర్ ఉన్నప్పటికీ రైతులకు మంచి ధర అందించడంలో మార్కెట్ పాలకవర్గం, అధికారు లు, సిబ్బంది సఫలీకృతులయ్యారు. ఈ-నామ్ లో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఇటీవల ఉత్తమ మార్కెట్ అవార్డును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి అందజేశారు.
రైతుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం
మార్కెట్కు వచ్చిన రైతులు ఆనందంగా ఇంటిబాట పట్టేందుకు విశేష కృషి చేస్తున్నాం. జిల్లాలో 122 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో 8 లక్షల 50 వేల బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా మిల్లర్లు,, ట్రేడర్స్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మంచి ధర అందించేందుకు కృషి చేశాం. ఈ-నామ్ అమలు సూర్యాపేట మార్కెట్లో పకడ్బందీగా అమలౌతుంది. దీన్ని కొనసాగిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
– లలితాదేవీఆనంద్, మార్కెట్ చైర్మన్, సూర్యాపేట
పకడ్బందీగా ఈ-నామ్ అమలు
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఈ-నామ్ విధానం పకడ్బందీగా అమలు అవుతుంది. ఈ నామ్ విధానాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ, రాజస్థాన్ రాష్ర్టాలకు చెందిన ఐఏఎస్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు వచి ఇక్కడి విధానం చూసి ఆశ్చర్యపోయారు. దేశంలోనే సూర్యాపేట మార్కెట్లో ఈ-నామ్ విధానం అద్భుతంగా అమలౌతుందని కితాబిచ్చారు. వారి రాష్ర్టాల్లో ఇదే తరహాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ-నామ్ అమలులో సూర్యాపేట మార్కెట్కు అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఇది మార్కెట్ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది కృషికి నిదర్శనం
– ఎండీ. ఫసియోద్దీన్, మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి, సూర్యాపేట