సూర్యాపేట సిటీ, డిసెంబర్ 30 : పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఘరానా దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి బంగారం, ద్విచక్రవాహనాలు రికవరీ చేశారు. వారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు, రికవరీ సొత్తు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ రాజేంద్రప్రసాద్ విలేకరులకు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మిర్యాలగూడ సుందర్నగర్కి చెందిన వేముల కోటేశ్ బిల్లా తాళం వేసిన ఇండ్లను గుర్తించి రెక్కి నిర్వహించి భార్య కృష్ణవేణి, గుర్రంపోడు మండలం అములూరుకు చెందిన గుంజ కోటేశ్ అలియాస్ చుక్క కోటితో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు.
ఇదే క్రమంలో వీరంతా నేరేడుచర్ల పీఎస్ పరిధిలో 3, నకిరేకల్ పీఎస్ పరిధిలో 1, హుజూర్నగర్ పీఎస్ పరిధిలో 3, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెంటచింతల పీఎస్ పరిధిలో 1 చోరీ చేశారు. వీరు దొంగిలించిన బంగారాన్ని కోటేశ్ బిల్లా భార్య తల్లిగారి ఊరైన నేరేడుచర్ల మండలం దాసారం గ్రామంలో ఉంచారు. ఈ క్రమంలో శుక్రవారం ముగ్గురు విజయవాడలో బంగారం అమ్మడానికి హుజూర్నగర్ పాత బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తుండగా హుజూర్నగర్ ఎస్ఐ పెట్రోలింగ్లో భాగంగా వారిని విచారించాడు. దాంతో తాము పలు చోరీలు చేశామని అంగీకరించారు.
వేముల కోటేశ్పై 2010 నుంచి నకిరేకల్, నార్కట్పల్లి, కట్టంగూర్, డిండి, మిర్యాలగూడ, హాలి యా, వలిగొండ, అచ్చంపేట, భువనగిరి, వాడపల్లి, గుడిపల్లి, గుర్రంపోడు, ఆదిభట్ల, కొండమల్లేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోరీలు చేయగా కొన్ని కేసుల్లో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి 2014లో కృష్ణవేణిని వివాహం చేసుకు న్నాడు. అనంతరం భార్యతో కలిసి హాలియా పీఎస్ పరిధిలో చోరీకి పాల్పడగా పోలీసులు పట్టుకున్నారు. ఆ కేసులో జైలు నుంచి విడుదలై తర్వాత కూడా చోరీలకు పాల్పడుతున్నాడు. కాగా నిందితుల నుంచి 27 తులాల బంగారు ఆభర ణాలు స్వాధీనం చేసుకొని కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. అలవాటుగా నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు.
9 కేసుల్లో 12 వాహనాలు స్వాధీనం
ద్విచక్ర వాహనాలు దొంగిలించి వాటి స్టిక్కర్లు కనిపించకుండా బ్లాక్ కలర్ స్ప్రే చేసి సొంత బైకులుగా వాడుతున్న మైనర్లలను అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. ఉదయం సూర్యాపేట పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖమ్మం క్రాస్రోడుఏ్డ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా బైక్ (స్పెండర్ప్లస్) నడుపుతున్న బాలుడిని ఆపి పత్రాలు చూపమని అడుగగా లేవనడంతో విచారించారు. ఆ బాలుడు, స్నేహితుడితో కలిసి కొద్ది రోజులుగా చెడు వ్యసనాలకు లోనై, జల్సాలకు అలవాటు పడి సూర్యాపేటతో పాటు మోతె, చివ్వెంల మండలాల్లో 7 బైక్లు దొంగిలించారు. మిగతా ఐదు బైక్లను అతనొ క్కడే దొంగిలించాడని అంగీకరించాడు. ప్రస్తుతం అతడి స్నేహితుడు చౌటుప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో డెకాయితీ కేసులో సైదాబాద్ బాలుర సంరక్షణ గృహంలో ఉన్నాడు. వీరిద్దరిపై గతంలో గంజాయి కేసు కూడా ఉందన్నారు. మొత్తం 12 ద్విచక్ర వాహనాలను అతడు దాచిపెట్టిన స్థలం వద్ద నుంచి స్వాధీనం చేసుకొని బాలుడిని అదుపులోకి తీసుకొని సంరక్షణ గృహానికి తరలించారు.
కేసును ఛేదించిన పట్టణ సీఐ, ఎస్ఐలు, టెక్నికల్, సీసీఎస్ ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేవంలో డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, స్పెసల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, సూర్యాపేట పట్టణ సీఐ రాజశేఖర్, హుజూర్నగర్ ఎస్ఐ వెంకటరెడ్డి, నేరేడుచర్ల ఎస్ఐ నవీన్, సీసీఎస్ ఎస్ఐ మహేశ్, టెక్ టీం సిబ్బంది పాల్గొన్నారు.