నీలగిరి, ఫిబ్రవరి 7 : ‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం బీఆర్ఎస్ ఏర్పడ్డది. తెలంగాణ ప్రజల హక్కుల సాధనకు పేగులు తేగేదాకా కొట్లాడుతాం. పోలీసులు యాక్టులు, సంకెళ్లు, నిర్బంధాలు మాకు కొత్తేమి కాదు. ఎన్ని అవాంతరాలు పెట్టినా ఈ నెల 13న నాగార్జున సాగర్ నీటిలో జరుగుతున్న అన్యాయంపై ప్రజలకు వివరించి తీరుతాం’ అని రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణ శివారు ప్రాంతంలో ఈ నెల 13న నిర్వహించే భారీ బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాకముందే కాంగ్రెస్ మరోసారి తెలంగాణ ప్రజల అత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిందన్నారు. కృష్ణా జలాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడం చాలా అన్యాయమని తెలిపారు. ఈ నెల 13న చలో నల్లగొండ పేరుతో నిర్వహించే భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని, కృష్ణా జలాల్లో జిల్లా ప్రజలు, రైతాంగానికి కాంగ్రెస్ చేసిన బాగోతాన్ని, ఆ పార్టీ నైజాన్ని బట్టబయలు చేస్తామని చెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులను చేజేతులా కేఆర్ఎంబీకి అప్పగించిన నీచులు కాంగ్రెస్ నాయకులని ఆయన మండి పడ్డారు.
సాగర్ ఆయకట్టు రైతాంగం తీవ్ర మనోవేదనకు గురవుతుంటే ఆదుకోవాల్సింది పోయి మళ్లీ ఎదురు దాడి చేస్తూ కాంగ్రెస్ నేతలు సన్నాయి నొక్కులు నొకుతున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి ఏదో ఆశించే కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రాజెక్టులను వారికి అప్పజెప్పారని పేర్కొన్నారు. సాగర్ డ్యామ్పై కేంద్ర బలగాలు మోహరించాయని, కాలు కూడా పెట్టనివ్వడం లేదని అన్నారు. తెలంగాణ ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్రెడ్డి ఉన్నప్పటికీ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుంటే మరోవైపు జిల్లాకు చెందిన మరో మంత్రి కోమటిరెడ్డి మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నరని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు పోలీసులతో రాజ్యం నడుపాలని చూస్తే వారి పతనం తప్పదని, ప్రజలు ఉరికించి కొడుతారని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని, పెద్ద పెద్ద రాకాసులతో కొట్లాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించామని, ఈ చిన్న చిన్న రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి తమకు లెక్కకాదని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా పైటర్స్ అని, కాంగ్రెసోళ్లకు ఏమాత్రం భయపడేది లేదని, ఆరునూరైనా మాజీ సీఎం కేసీఆర్తో సభ నిర్వహించి తీరుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెరుకు సుధాకర్, ఐసీడీఎస్ మాజీ ఆర్ఓ మాలె శరణ్యారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంధినేని జనార్దన్రావు, మారగోని గణేశ్, నాయకులు మెరుగు గోపి, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్నారు.