సూర్యాపేట జిల్లా జనరల్ దవాఖానకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆసుపత్రిలో పురుడు పోసుకునే ప్రతి శిశువుకూ ముర్రుపాలు తాపించేలా చర్యలు తీసుకోవడంతోపాటు తల్లిపాల ప్రాముఖ్యతపై విరివిగా అవగాహన కల్పించడంలో మంచి ఫలితాలు సాధించింది. దాంతో బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు గత మూడు నెలల్లో రాష్ట్రంలోని మూడు జిల్లాల ఆసుపత్రులకు దక్కగా తాజాగా సూర్యాపేటకు వచ్చింది. డబ్ల్యూహెచ్ఓ ఆదేశాల మేరకు బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా (బీపీఎన్ఐ) సంస్థ తల్లిపాల ప్రోత్సాహానికి 9 అంశాలను అమలు చేయాలని దేశ వ్యాప్తంగా ఆసుపత్రులకు సూచనలు చేసింది. ఇందులో సూర్యాపేట జనరల్ దవాఖాన విజయవంతంగా కొనసాగిస్తున్నది. ఇప్పటికే ఈ ఆస్పత్రి సాధారణ ప్రసవాల్లో రికార్డు సాధించగా పలు వైద్య సేవల్లోనూ ఆదర్శంగా నిలిచింది.
– సూర్యాపేట, మే 7 (నమస్తే తెలంగాణ)
రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అన్ని రంగాలతోపాటు అత్యంత ప్రధానమైన విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నది. గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో సామాన్యులకు విద్యను చేరువ చేసింది. మన ఊరు – మన బడితో పాఠశాలల రూపుమార్చింది. మరో పక్క మెడికల్ కళాశాలలు, పల్లె, బస్తీ దవాఖానలు, అత్యాధునిక వైద్య పరికరాలతో నాణ్యమైన అత్యుత్తమ వైద్యాన్ని దరిచేర్చింది. ఈ క్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లాలోనూ వైద్యం బాగుపడింది. మెడికల్ కళాశాల, దాని అనుబంధ జనరల్ ఆస్పత్రితో అనేక రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్ సమయంలో జిల్లా నుంచే కాకుండా వరంగల్, జనగాం, నల్లగొండ, నాగార్జునసాగర్తోపాటు ఏపీ నుంచి కూడా బాధితులు వచ్చి చికిత్స చేయించుకున్నారంటే ఇక్కడ వైద్య సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సమైక్య రాష్ట్రంలో ఏరియా ఆసుపత్రిగా ఉండగా రోజుకు పది మంది కూడా పేషెంట్లు రాకపోయేది. ఇప్పుడు రోజుకు వందల సంఖ్యలో వైద్యం కోసం వస్తున్నారు. దీంతో అవార్డులు సైతం వస్తున్నాయి.
– సూర్యాపేట, మే 7 (నమస్తే తెలంగాణ)సాధారణ ప్రసవాలలో రాష్ట్రంలోనే టాప్లో నిలువడం, అన్ని వైద్య సేవలు అందించడంలో మన్ననలు పొందుతున్న సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తల్లిపాల ప్రాముఖ్యతపై విరివిగా ప్రచారం చేస్తూ దవాఖానలో పురుడు పోసుకునే ప్రతి శిశువుకు ముర్రు పాలు తాపించేలా చర్యలు తీసుకుంటూ వంద శాతం సక్సెస్ కావడంతో జాతీయ బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అవార్డుకు ఎంపికైంది. డబ్ల్యూహెచ్ఓ ఆదేశాల మేరకు బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా (బీపీఎన్ఐ) సంస్థ దవాఖానల్లో తల్లిపాల ప్రోత్సాహానికి సంబంధించి మొత్తం 9 అంశాలను అమలు చేయాలని దేశ వ్యాప్తంగా ఆస్పత్రులకు సూచనలు చేసింది.
అందులో భాగంగా మన రాష్ట్రంలోని అన్ని దవాఖానల్లో మూడు నెలల క్రితం ప్రారంభించగా ఇప్పటి వరకు కామారెడ్డి, గజ్వేల్, జనగాం జిల్లా ఆస్పత్రులకు అవార్డులు రాగా.. తాజాగా సూర్యాపేట జనరల్ దవాఖానకు వచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లి పాలు పట్టించడం వల్ల ఉపయోగాలు, పాలు పట్టించే విధానాలు తెలియజేస్తుండడం.. పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, లాక్టేషన్ వర్కర్, సిస్టర్ల సమన్వయంతో పనిచేస్తూ రోజువారీ డెలివరీలు, పుట్టిన బిడ్డకు వెంటనే పాలు పట్టించడం చేసి ఆన్లైన్లో వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. సూర్యాపేట దవాఖానలో బయటి నుంచి డబ్బా పాలు రాకుండా ఐఎంఎస్ చట్టం కఠినంగా అమలు చేయడం, అప్పుడే పుట్టిన బిడ్డకు పాలు పట్టించే విధానంపై బాలింతలకు డాక్టర్లు, నర్సులు అందిస్తున్న కౌన్సిలింగ్ విధానం అద్భుతంగా ఉన్నదని భావించిన బీపీఎన్ఐ ఈ అవార్డు ప్రకటించింది.
బీఎఫ్హెచ్ గుర్తింపునకు ఇలా..
సూర్యాపేట ఎంసీహెచ్లో కాన్పు అయిన బాలింతలకు తల్లిపాలు పట్టే విషయంలో ప్రత్యేకంగా గైనకాలజీ వైద్యులతోపాటు నర్సులు అవగాహన కల్పిస్తున్నారు. కాన్పు అయిన తరువాత ఎంసీహెచ్కు పరీక్షల నిమిత్తం వచ్చే బాలింతలకు రోజూ తల్లిపాలు పడుతున్నారా? అనే కోణంలో పర్యవేక్షిస్తున్నారు. ప్రసవించిన తర్వాత ఆస్పత్రిలో ఉన్న రోజుల్లో తల్లిపాలు ఇచ్చే సమయంలో బాలింతల ఇబ్బందులను గమనించి పరిష్కరిస్తున్నారు. ఒకవేళ పాలు రాకపోతే వచ్చే విధంగా పలు పద్ధతుల్లో చికిత్స అందిస్తూ కావాల్సిన నిబ్లను సమకూరుస్తున్నారు. నవజాత శిశువు పుట్టగానే ముర్రుపాలు తాగించాలని సూచిస్తున్నారు. వీటితోపాటు తల్లిపాలు పట్టేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ గత నెలలో న్యాక్ (నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్) పరిశీలించింది. తల్లిపాలు పట్టే విషయంలో అన్ని రకాలుగా ముందున్నట్లు గుర్తించిన కౌన్సిల్ సూర్యాపేట ఆస్పత్రిని అవార్డుకు ఎంపిక చేసింది. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా (బీపీఎన్ఐ) సంస్థ అవార్డు ప్రకటించింది.
సమష్టి కృషితో జాతీయ స్థాయి గుర్తింపు
దవాఖాన వైద్యులు, సిబ్బంది సమష్టి కృషితోనే బీఎఫ్హెచ్ గుర్తింపు పొంది అవార్డు సాధ్యమైంది. తల్లిపాలు పట్టే విషయంలో బాలింతలకు అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నాం. దీనికిగాను ప్రత్యేక విభాగాలను ఏర్పాటు ఏశాం. అప్పుడే పుట్టిన శిశువులకు తల్లి పాలు ఎంతో మేలనేది బాలింతలకు గర్భం దాల్చినప్పటి నుంచే అవగాహన కల్పిస్తున్నాం.
– డాక్టర్ మురళీధర్రెడ్డి, సూపరింటెండెంట్, సూర్యాపేట జనరల్ ఆస్పత్రి
మహిళల్లో మార్పు కనిపిస్తున్నది
గతంలో శిశువుకు ముర్రు పాలు తాపించాలంటే మహిళల్లో కొంత భయం ఉండేది. డాక్టర్లు, వైద్య సిబ్బంది ముర్రుపాల ఆవశ్యకతను వివరిస్తుండడంతో మహిళల్లో మార్పు వస్తున్నది. వాస్తవానికి ముర్రుపాలతో శిశువుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సూర్యాపేటలో కార్పొరేట్ తరహాలో అత్యాధునిక పడకలు, వెంటిలేటర్లు, ఇతర వసతులు ఉన్నాయి. శిశువులకు పాలు తాగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
– డాక్టర్ శ్రీకాంత్భట్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, సూర్యాపేట