సూర్యాపేట సిటీ, ఫిబ్రవరి 2 : బాలల రక్షణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, వెట్టి చాకిరీకి గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. జిల్లా పోలీసు, బాలల రక్షణ, లేబర్, రెవెన్యూ, వైద్య తదితర శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని జిల్లాలో నెల రోజులుగా పకబ్బందీగా నిర్వహించామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా నిరాధరణకు గురవుతున్న, వెట్టి చాకిరీలో మగ్గుతున్న 182 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులు, సంరక్షకులకు అప్పగించామని వివరించారు.
ఇందులో తెలంగాణ రాష్ర్టానికి చెందిన బాలురు 85, బాలికలు 11మంది ఉన్నారని, ఇతర రాష్ర్టాలకు చెందిన బాలురు 65మంది, బాలికలు 21 మంది ఉన్నారని తెలిపారు. ఆపరేషన్ స్మైల్లో లక్ష్యాన్ని చేరేలా సిబ్బంది అందరూ బాగా పని చేశారని కితాబిచ్చారు. బాలల వికాసానికి, బంగారు భవిష్యత్తుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని, బాలలు చదువుకునేలా ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వాలు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తున్నాయని, తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారికి బంగారు భవిష్యత్తును అందించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.