చివ్వెంల, జనవరి 10 : ఆయిల్ పామ్లో అంతర పంటల సాగుతో అధిక లాభం పొందుతున్నారని సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. చివ్వెంల మండల పరిధి గుంపుల తిరుమలగిరిలో బుధవారం ఆయన ఆయిల్ పామ్ తోటలను పరిశీలించి మాట్లాడారు. పామాయిల్ సాగుతో పాటుగా అంతర పంటల ద్వారా మంచి ఆదాయం లభిస్తుందన్నారు. పామాయిల్ పంట నాలుగో సంవత్సరంలో పంట దిగుబడి వస్తుందని, 30 సంవత్సరాలు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వస్తుందని తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో పతంజలి ద్వారా పామాయిల్ మొక్కల పంపిణీ జరుగుతుందని చెప్పారు. పామాయిల్ తోటలో మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంటలుగా మిర్చి, వేరుశనగ, కంది, అరటి, బొప్పాయి, కూరగాయలు వంటి పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. ఆయిల్ పామ్ తోటల పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం కూడా చేపట్టవచ్చని చెప్పారు.
ఈ సందర్భంగా 5 ఎకరాల్లో పామాయిల్తోపాటు అంతర పంటగా మిర్చి, కంది సాగు చేసిన ప్రభాకర్రెడ్డిని కలెక్టర్ అభినందించారు. ఆయన వెంట జిల్లా ఉద్యాన వన పట్టు పరిశ్రమల అధికారి శ్రీధర్, పతంజలి పామాయిల్ డీజీఎం యాదగిరి, సూర్యాపేట ఉద్యానవన అధికారి జగన్, పతంజలి సిబ్బంది హరీశ్, సుధాకర్, రైతులు రాఘవరెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.