తుర్కపల్లి, సెప్టెంబర్ 14 : ప్రభుత్వం మంజూ రు చేసిన దళితబంధు నిధులతో వాసాలమర్రిలో దళితులు వివిధ యూనిట్లను నెలకొల్పే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో ఆగస్టు 4న గ్రామంలోని 76దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున 7.60 కోట్లు మంజూరు చేసి 24గంటలోపే కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. అందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు 15రోజుల పాటు ఇం టింటా తిరుగుతూ వారి ఆర్థిక స్థితిగతులు, వృత్తి నైపుణ్యత తదితర విషయాలను సేకరించారు. ఇటీవలె 66మంది దళిత కుటుంబాల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. అందులో 29కుటుంబాలు యూనిట్లను ఎంపిక చేసుకోగా ఈ నెల 9న వారికి జిల్లాలోని ధర్మారెడ్డిగూడెం, కూనూరు, రాయిగిరి, కందుకూరు గ్రామాల్లో విజయవంతంగా నడుస్తున్న డైయిరీ, గొర్రెలు, కోళ్లఫాంలను చూపించి అవగాహన కల్పించారు. రెండో విడుత మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హార్టికల్చర్ అధికారులు మరో 27కుటుంబాల వారికి కూరగాయలు, పూలు, పండ్లతోటల పెంపకంపై జిల్లాలోని పల్లెపహాడ్, మేడిపల్లి, ముగ్దుంపల్లి, అనాజీపురం, గొల్లెపల్లి గ్రామాల్లో విజయవంతంగా సాగవుతున్న పండ్ల తోటలు, పూలు, కూరగాయలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా హర్టికల్చర్ అధికారి అన్నపూర్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్సుందర్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రవణ్కుమార్, ఎంపీడీఓ ఉమాదేవి, హార్టికల్చర్ అధికారి సౌమ్య, పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి పాల్గొన్నారు.