హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఎన్డీయే, ఇండియా కూటములకు పరాభవం తప్పదని అన్నారు. జాతీయ వార్తా సంస్థ పీటీఐ సోమవారం కేసీఆర్ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పారు. అబద్ధపు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలకు అర్థమైందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డజనుకుపైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సముద్రమంత పార్టీ అని, నలుగురైదురు నేతలు వెళ్లిపోయినంత మాత్రాన నష్టం లేదని అన్నారు. వీటితోపాటు ఇంటర్వ్యూలో పంచుకున్న పలు అంశాలు యథాతథంగా..
రాష్ర్టాన్ని పాలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇది నా మాట కాదు. స్వయంగా ప్రజలు చెపున్న మాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా అధ్వానమైన పాలన చూడబోతున్నాం.
ఇది వారి భ్రమ మాత్రమే. వాళ్లు అంధకారంలో మునిగిపోయి ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్లతో పోల్చితే తెలంగాణ ప్రజలు ఎక్కువగా అభిమానించే పార్టీ బీఆర్ఎస్. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. పొరపాటున ఒక్కసీటు వస్తే రావొచ్చు. బీఆర్ఎస్ కచ్చితంగా డజనుకుపైగా స్థానాల్లో గెలుస్తుంది.
ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ గెలవాలో, ఏ పార్టీ ఓడిపోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. ఇందులో ఆరింటిని గ్యారంటీలుగా చెప్పింది. వాటిని అమలు చేయడానికి ప్రత్యేకంగా చట్టం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రజలు అసత్యపు హామీలను నమ్మారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి, తాగునీరు అందడం లేదు, భారీగా విద్యుత్తు లోటు కనిపిస్తున్నది. విద్యుత్తు సరఫరా సరిగా లేక రైతుల మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. గత తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ చూడని పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రజలకు ఈ విషయం అర్థమైంది. అబద్ధపు హామీలకు మోసపోయామని తెలుసుకున్నారు.. కాబట్టి ఈ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో ‘పొద్దుతిరుగుడు పువ్వు’ నేతలు ఎక్కువయ్యారు. సూర్యుడి చుట్టూ పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్టు.. కొందరు నేతలు అధికారం చుట్టూ తిరుగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి వేళ్లమీద లెక్కపెట్టగలిగేంత మంది మాత్రమే వెళ్లిపోయారు. బీఆర్ఎస్ పార్టీ సముద్రం లాంటిది. మాకు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నది. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. వీటితో పోల్చితే మా పార్టీ నుంచి వెళ్లిపోయింది అతి తక్కువ మంది. ఈ ఎన్నికల్లో వాళ్ల ప్రభావం ఏమీ ఉండదు. పార్టీ చాలా బలంగా ఉంది. ఆందోళన అవసరం లేదు.
నేను బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఒక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని భావించాను. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ పాలనతో దేశం ఎంతో నష్టపోయింది. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలన ఒక వైఫల్యం అయితే.. మోదీ పాలన ఏకంగా ఒక విపత్తులా పరిణమించింది. బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా ప్రయోజనం కలుగలేదు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి విలువ పడిపోతుందంటూ మోదీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. మరి ఇప్పుడు డాలర్కు రూ.84 స్థాయికి ఎందుకు పతనం అయ్యిందో సమాధానం ఇవ్వగలరా?. దేశం నుంచి పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతున్నారు, దిగుమతులు పెరిగిపోయాయి. రైతులకు మోదీ క్షమాపణ చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని స్వయంగా కొందరు మంత్రులు చెప్తున్నారు.
దేశానికి స్వా తంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటింది. అయినా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎందుకు ఉండాలి? మనతో ప్రయాణం మొదలుపెట్టిన చైనా ఎలా మారిపోయిందో అందరికీ తెలుసు. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబు దాడికి గురైన జపాన్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నది? మనం ఎక్కడున్నామో ఆలోచించాలి. మన దేశంలో అద్భుతమైన సహజ వనరులు ఉన్నాయి. అపారమైన నీటి వనరులు ఉన్నాయి. కావాల్సినంత బొగ్గు ఉన్నది. అయినా దేశం ఇప్పటికీ కరంటు కోతలు ఎదుర్కొంటున్నది. డిమాండ్కు తగినంత సరఫరా లేక అంధకారంలో ఉంటున్నది. అందుకే పారిశ్రామికవేత్తలు దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇటీవలే టెస్లా వచ్చి పారిపోయింది. ఇవన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి. ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ ఎలాంటివో స్పష్టంగా అర్థమైంది. వాళ్ల వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసిపోయింది.
ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా రావు. అలాంటిది రెండు దశల్లోనే 200 సీట్లు దాటామని చెప్పడం గోబెల్స్ను మించిన ప్రచారం. ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తిగా మారబోతున్నాయి.
మీ ప్రశ్నే తప్పు. ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి మధ్యే పోటీ అనే భావన సరికాదు. పైగా ఇప్పుడు ఇండియా కూటమి అనేదే లేదు. మమతా బెనర్జీతోపాటు చాలామంది కూటమి నుంచి బయటికి వచ్చేశారు. ఇప్పుడు బీజేపీ లేదా ఎన్డీయేతో గట్టిగా పోరాడుతున్నది ప్రాంతీయ పార్టీలు మాత్రమే. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే బలమైన శక్తిగా మారబోతున్నాయి. కాబట్టి ఇందులో తెలంగాణకు సంబంధించి బలమైన వాణి వినిపించేలా ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. హంగ్ ఏర్పడితే మేము కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికీ సపోర్ట్ చేయం. ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేయబోయే కూటమికే బీజేపీ, లేదా కాంగ్రెస్ వచ్చి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
అనుభవం, ప్రజాదరణ ఉన్న మంచి నేతను ప్రధానిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది.
ఇదంతా మోదీ సృష్టి. లేని కుంభకోణంలో నా బిడ్డ కవితను అరెస్ట్ చేయడం పెద్ద జోక్. ఇప్పుడు దేశంలో నేను, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ వంటి నలుగురైదుగురు నేతలు మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నాం. ఇది ఆయన తట్టుకోలేకపోతున్నారు. అందుకే లిక్కర్ స్కామ్ను తెరమీదికి తెచ్చి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అసలు ఇది కుంభకోణమే కాదు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం. ప్రభుత్వం తెచ్చిన పాలసీని కుంభకోణం అని ఎవరైనా అంటారా? మోదీ సృష్టించిన కట్టుకథలు కాకపోతే.. ఒక్క రూపాయి కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు?.
బస్సుయాత్రతో ప్రజల్లో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడ్డాయని ఈ ఘటన రుజువు చేస్తున్నది. అందుకే నా గొంతు నొక్కాలని ప్రయత్నించారు. మోదీ మతవిద్వేష వ్యాఖ్యలు చేసినా ఈసీ పట్టించుకోలేదు. సీఎం రేవంత్రెడ్డి నాపై అభ్యంతరకరమైన భాష వాడినా ఏమీ అనడం లేదు. మేం ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పెట్టేస్తున్నారు. అయినా ఈ నిషేధం ఎలాంటి ప్రభావం చూపదు. వాళ్ల గురించి ప్రజలకు అర్థమైంది. ఎన్నికల్లో దానిని చూపిస్తారు.