KCR | హైదరాబాద్, మే 6(నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వం మెడలు వంచైనా సరే రైతులకు రైతుబంధు ఇప్పిస్తా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు చెప్పిన మాటలు వాస్తవమయ్యాయి. ఎప్పుడో డిసెంబర్, జనవరి నెలల్లో రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన రైతుబంధు నిధులు, యాసంగి సీజన్ ముగుస్తున్నా జమకాకపోవడంపై కేసీఆర్ పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్కు మద్దతుగా స్పందించింది. తద్వారా రైతుబంధు ఇవ్వక తప్పని అనివార్య పరిస్థితిని కేసీఆర్ కల్పించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు రైతుబంధు నిధులను విడుదల చేసింది. ఇప్పటికే ఐదెకరాల వరకు రైతుబంధు విడుదల చేసిన ప్రభుత్వం, సోమవారం ఐదెకరాలకుపైగా భూమి గల రైతుల ఖాతాల్లో సైతం జమచేసింది. వాస్తవానికి, యాసంగి సీజన్కు మొత్తం 1.52 కోట్ల ఎకరాలకుగాను రూ.7,625 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది. ఇందులో ఐదెకరాల రైతులకు రూ.5,202 కోట్లు ఇప్పటికే అందజేసిన ప్రభుత్వం.. తాజాగా ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న మిగిలిన రైతులకు రూ.2,423 కోట్లను విడుదల చేసింది. ఈ విధంగా సుమారు ఐదు నెలలపాటు కొనసాగిన యాసంగి రైతుబంధు పంపిణీ ఎట్టకేలకు పూర్తయింది.
ఈ యాసంగి సీజన్లో ఐదెకరాల వరకే రైతుబంధు వేసి ఆపేయాలని ప్రభుత్వం తొలుత భావించినట్టు తెలిసింది. అందుకే ఐదెకరాలు పైబడిన రైతులకు జమ చేయకుండా ఆలస్యం చేసిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ, ప్రభుత్వం కుట్రలకు కేసీఆర్ చెక్ పెట్టారు. రైతులకు పెట్టుబడి కష్టాలు రావొద్దనే ఉద్దేశంతో తాను ప్రవేశపెట్టిన రైతుబంధు సాయం పంపిణీ ఆలస్యం కావడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వం సాగుకు ముందే అందరికీ రైతుబంధు అందిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రతి సభలోనూ ప్రశ్నించారు. రైతుబంధు ఇచ్చేవరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చరించారు.
ఒకవైపు కేసీఆర్ ప్రశ్నల పరంపర, మరోవైపు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సిన వస్తుందన్న భయం అధికార కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. కేసీఆర్ ప్రశ్నలతో తమకు నష్టం జరుగుతున్నదని గ్రహించిన సీఎం రేవంత్రెడ్డి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ నెల 8లోగా ప్రతి రైతుకూ రైతుబంధు జమ చేస్తామని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆగమేఘాలపై అప్పు చేసి మరీ రైతుబంధు అందించడం గమనార్హం. నిధులు విడుదల చేయకపోతే ప్రజా విశ్వాసం కోల్పోతామన్న ఆందోళనతోనే ఈ చర్యకు ఉపక్రమించినట్టు తెలిసింది.
రైతుల పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఖరి ఏమిటనేది రైతుబంధుతో తేటతెల్లమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమాన్ని కూడా రాజకీయం చేస్తే, బీఆర్ఎస్ మాత్రం రాజకీయం కన్నా రైతుల సంక్షేమమే ముఖ్యమని ఆచరణలో రుజువు చేసుకున్నది. ఈ రెండు పార్టీల వైఖరికి ఈ యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. రైతులకు యాసంగి సీజన్ రైతుబంధు సకాలంలో అందాలన్న ఉద్దేశంతో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రైతుబంధు పంపిణీకి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకొని, నిధులు సిద్ధం చేయగా, నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల ముందు ఏ విధంగా రైతుబంధు ఇస్తారంటూ ఆనాడు ప్రశ్నించిన కాంగ్రెస్.. రైతులకు నోటికాడి ముద్దను దూరం చేసింది. తాము అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే రూ.ఐదు వేలకు, రైతు భరోసా కింద మరో రూ.ఐదు వేలు జోడించి ఇస్తామంటూ నమ్మబలికింది.
తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. ఈ సారికి గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధునే ఇస్తామని ప్రకటించింది. వాస్తవానికి, డిసెంబర్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మరుక్షణమే రైతుబంధును అందరి ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నప్పటికీ, జాప్యం చేస్తూ వచ్చింది. చివరకు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు కొద్ది రోజుల ముందు నిధులు విడుదల చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రవర్తించిన విధంగా నేడు బీఆర్ఎస్ వ్యవహరించలేదు.
రైతుల సంక్షేమమే పరమావధిగా విశాల దృక్పథం ప్రదర్శించింది. రైతుబంధు పంపిణీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయకుండా నిండు మనసు చాటుకున్నది. సమయం ఏదైనా సరే, రైతులకు పెట్టుబడి సాయం అందితే చాలని భావించిన బీఆర్ఎస్ పార్టీ రైతుబంధు పంపిణీకి పూర్తి మద్దతు ప్రకటించింది. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులు తాము రైతుబంధును అడ్డుకోబోమని స్పష్టంచేశారు. అందుకుతగ్గట్టుగానే సోమవారం రైతుబంధు పంపిణీకి బీఆర్ఎస్ పార్టీ ఏవిధమైన ఆటంకాలు సృష్టించలేదు. ఈ విధంగా రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తే.. బీఆర్ఎస్ మాత్రం రాజకీయాలకు అతీతంగా మానవీయంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.