యాదగిరిగుట్ట, ఫిబ్రవరి18 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తంలో ఆలయాన్ని తెరిచిన అర్చక బృందం లక్ష్మీనరసింహస్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకర మండపంలో స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు.
తూర్పు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు కల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకలో భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు నిర్వహించారు. స్వామివారిని సుమారు 18 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.19,47,352 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
21న యాదగిరిగుట్టకు అఖండ జ్యోతి యాత్ర
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించే 29వ అఖండ జ్యోతి యాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్లోని బర్కత్పురలోగల యాదగిరి భవన్లో శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలె వెంకటేశ్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనారసింహాచార్యులు యాత్రను ప్రారంభించారు. అఖండజ్యోతి పాదయాత్ర ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి మీదుగా ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు యాదగిరిగుట్ట పట్టణానికి చేరుకుంటుందని ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు. అనంతరం జ్యోతియాత్రను స్వామివారి పురవీధుల్లో వైభవంగా ఊరేగిస్తామని చెప్పారు. గుట్టలో అఖండ జ్యోతియాత్రకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఆలయ ఈఓ, ప్రధానార్చక బృందం ఘనస్వాగతం పలుకనున్నారు. కార్యక్రమంలో అఖండజ్యోతి పాదయాత్ర కమిటీ ఇన్చార్జి వివేక్ వెంకట్రెడ్డి, ఏఈఓ గట్టు శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.
వైటీడీఏ ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు
లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలకు స్థలాన్ని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి పరిశీలించారు. శనివారం కొండపైకి చేరుకున్న వారు ఆగ్నేయ ప్రాంతంలో గల బ్రహ్మోత్సవ మండపం, తూర్పు మాఢ వీధులను పరిశీలించారు. దేశవ్యాప్తంగా పేరుగాంచిన కళాకారులు రానున్న నేపథ్యంలో అందుకు కావాల్సిన ఏర్పాట్లు, విద్యుద్దీపాలంకరణ, ప్రత్యేక మండపాన్ని అలంకరించాలని సూ చించారు. ఈ నెల 24 నుంచి కల్యాణోత్సవం వరకు జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారులకు ప్రత్యేక గదిలో వసతి కల్పించాలని ఆలయ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ డీఈఓ భాస్కర్శర్మ, విద్యుత్ ఈఈ ఊడెపు రామారావు, ఆలయ సివిల్ విభాగం అధికారి మహిపాల్రెడ్డి పాల్గొన్నారు.
శాస్రోక్తంగా శతరుద్రాభిషేకం
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి నిత్య పారాయణాల అనంతరం లింగోద్భవ కాలమున మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం నిర్వహించారు. పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలు, సమక, చమక పారాయణాలతో వైభవంగా సాగింది. శివరాత్రి సందర్భంగా హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్, భాగవతార్ ఆధ్యర్యంలో హరికథ, యాదాద్రి భజన సేవా సమితి, మహిళా భజన మండలి, మిర్యాల లక్ష్మి బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జరిగాయి. గడ్డం పాండు బృందంచే చిందుయక్షగానం భక్తులను ఆకట్టుకున్నాయి.