యాదగిరిగుట్ట, మార్చి 23 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు ఆరగంట పాటు సుప్రభాతాన్ని వినిపించి స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణోత్సవం జరిపారు.
సుమారు గంటన్నరపాటు జరిగిన వేడుకల్లో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి, దర్బార్ సేవల్లో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. అనుబంధ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామనవమి వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం యాగశాల మంపడంలో ఆలయ సిద్ధాంతి, ప్రధానార్చకులు, అర్చకులు నిత్యారాధనలు జరిపారు. స్వామివారిని సుమారు 20 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.23,19,262 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.