రామగిరి, ఏప్రిల్ 22 : విద్యార్థుల పరీక్ష ఫలితాలను ఆన్లైన్లో అందించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఇప్పటికే 1నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (ఎస్ఏ-2) నిర్వహించగా.. ఫలితాలు వెల్లడించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే.. గతంలో కంటే భిన్నంగా విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులను ఆన్లైన్లో అందించేలా రాష్ట్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. మంగళవారం పాఠశాలలకు చివరి రోజు కావడంతో విద్యార్థులకు టీచర్లు ఆన్లైన్ ప్రగతి పత్రాలను అందజేయనున్నారు.
విద్యార్థులకు ఈ నెల 15నుంచి 21వరకు ఎస్ఏ-2 పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ఎఫ్ఏ 1, 2, 3, 4 ఫలితాలతోపాటు ఎస్ఏ -1 ఫలితాలను ఆన్లైన్లో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు నమోదు చేశారు. ఎఫ్ఏ – 2 జవాబు పత్రాలను ఉపాధ్యాయులు ఏరోజుకారోజు మూల్యాంకనం పూర్తి చేశారు. విద్యార్థులకు వచ్చిన మార్కులను ఐఎస్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేశారు. గతంలో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను పాఠశాల చివరి పని దినం రోజు అందజేసేవారు. ఈ పర్యాయం ఆన్లైన్లో ప్రగతి పత్రాలను డౌన్లోడ్ చేసి పూర్తి సమాచారంతో అందజేయనున్నారు. విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు సంవత్సరంలో నిర్వహించిన ఎఫ్ఏ – 1, 2, 3, 4తోపాటు ఎస్ఏ – 1, 2 ఫలితాలతో ఆన్లైన్ ప్రగతి పత్రం ఉండనుంది. అది విద్యార్థులకు ఎప్పుడైనా అందుబాటులో ఉండనున్నది.
గతంలో ప్రోగ్రెస్ కార్డులను విద్యాశాఖ సమగ్రశిక్ష నుంచి సరఫరా చేసేది. ప్రస్తుతం వాటి సరఫరా లేకపోవడంతో గత సంవత్సరం ఆన్లైన్ ప్రగతి ప్రతాల పంపిణీకి చర్యలు తీసుకోగా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఈ పర్యాయం పూర్తిగా అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థి ప్రస్తుతం చదివే బడి వదిలి కొత్త పాఠశాలకు వెళ్లే సమయంలో టీసీతోపాటు ఆన్లైన్ ప్రగతి పత్రం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్ చేసి సంతకం చేసి అందజేయాల్సి ఉంటుంది. నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,113 ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వాటిల్లో 2,27,345 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారందరికీ మంగళవారం ఆయా పాఠశాలల్లో ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేస్తారు.
1నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులకు ఈ నెల 24నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 48 రోజుల పాటు సెలవులు వస్తుండగా.. పాఠశాలలకు మంగళవారం చివరి పని దినంగా చెప్పవచ్చు. జూన్ మొదటి వారం నుంచే బడిబాట కార్యక్రమం చేపట్టాలని విద్యాశాఖ భావిస్తుంది.
రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉత్తర్వుల మేరకు అన్ని పాఠశాలల్లో 1నుంచి 9వ తరగతి విద్యార్థులకు (2023-24) ఆన్లైన్ ప్రగతి పత్రాలు (ప్రోగ్రెస్ కార్డులను) అందజేయాలి. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసిన ప్రగతి పత్రాలపై ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి ఇవ్వాలి. ఈ పత్రాలు విద్యార్థుల ఫలితాలకు దర్పణంగా నిలుస్తాయి. విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా జిల్లాలో అందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్కు నాంది పలికేలా చర్యలు తీసుకుంటున్నాం.
– బి.భిక్షపతి, నల్లగొండ డీఈఓ