సంప్రదాయాలను ప్రోది చేసుకుంటూ, సరదాల సంక్రాంతి వచ్చేస్తున్నది. వస్తూ వస్తూ పట్టణాలను పల్లెలకు వెంట బెట్టుకుని వస్తున్నది. ఉపాధి కోసం రెక్కలు గట్టుకుని వలస పోయిన పక్షులన్నింటినీ సొంత గూటికి చేరుస్తున్నది. పిల్లల నోరు తీపి చేసేందుకు అమ్మ చేతి పిండి వంటలు సిద్ధమవుతున్నాయి. పల్లె దారిలో ఆత్మీయ పలుకరింపులు వినిపిస్తున్నాయి. బట్టల కొనుగోళ్లతో షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. కొత్త సినిమాల విడుదలకు టాకీసులు ముస్తాబయ్యాయి. పతంగులు పోటాపోటీగా ఎగురుతున్నాయి. ముగ్గుల పోటీలతో వీధులు, విద్యా సంస్థలు కళకళలాడుతున్నాయి. హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేవారు, ఆంధ్రాకు వెళ్లే వాహనాలతో 65వ నంబర్ జాతీయ రహదారిపై రద్దీ మొదలైంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ ఉన్నప్పటికీ గురువారం వాహనాలు బారులు తీరడం కనిపించింది. మరోవైపు బస్టాండ్లు, బస్సులూ కిక్కిరిసి పోయాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు.
– రామగిరి/నేరేడుచర్ల/చౌటుప్పల్ రూరల్, జనవరి 12
సంక్రాంతి పండుగ అంటే మూడు రోజుల ముచ్చటైన పండుగ. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ పండుగను అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. పట్టణాల్లో ఉండే పల్లె వాసులంతా తమ స్వస్థలాలకు పయనం అవుతుండగా… జిల్లా కేంద్రాల్లో నివాసం ఉండే వాసులు సైతం స్వగ్రామాలకు వెళ్తుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ సందడి కనిపిస్తున్నది. మరో వైపు ఇప్పటికే యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలకు ఈ నెల 8 నుంచి సెలవులు ప్రకటించగా, 13 నుంచి 17వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ఇటు విద్యార్థులు, అటు పండుగకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి. ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్లే మూడు ప్రధాన రహదారులపై (హైదరాబాద్-నకిరేకల్-సూర్యాపేట-విజయవాడ, నార్కట్పల్లి-అద్దంకి, హైదరాబాద్ వయా కొండమల్లేపల్లి-నాగార్జునసార్) వాహనాల రద్దీ పెరిగింది. ఇదే పరిస్థితి శుక్ర, శనివారాల్లోనూ కొనసాగే పరిస్థితి ఉంది.
– రామగిరి, జనవరి 12
పట్టణాల నుంచి పల్లెలకు..
సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు ఇప్పటికే పట్టణాల నుంచి తమ స్వగ్రామాలకు బాటపట్టారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సైతం అదనపు చార్జీలు లేకుండా సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడుపుతుండడంతో గమ్యస్థానాలకు సంతోషంగా చేరుతున్నారు.
ప్రధాన రహదారులపై పటిష్ట భద్రత
ప్రయాణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలు చోటుచేసుకోకుండా నేషనల్ హైవే, టోల్ గేట్ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పటిష్టమైన నిఘాతో భద్రతా ఏర్పాట్లు చేశారు. టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ సెన్సార్ సమయం మూడు సెకండ్ల నుంచి రెండు సెకండ్లకు కుదించారు. అదేవిధంగా ఫాస్టాగ్ లేని వాహనదారులు వాటిని తీసుకునేలా సుమారు 25 కంపెనీలు ఆయా టోల్గేట్ల వద్ద కౌంటర్లను ఏర్పాటు చేశారు.
పోలీసుల కౌన్సెలింగ్..
జిల్లాలోని జాతీయ రహదారుల గుండా పండుగకు వెళ్లే వాహనదారులకు పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అయితే వాహనదారులు అతివేగంగా వెళ్లొద్దని, నిర్ణీత వేగంతోనే వెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు రాత్రిపూట నిద్రవస్తే కచ్చితంగా విశ్రాంతి తీసుకొని వెళ్లాలని కోరుతున్నారు. విశ్రాంతి కోసం పోలీసులు, నేషనల్ హైవే సిబ్బంది ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి వివరిస్తున్నారు. ఏర్పాట్లపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదనపు బస్సులు..
ఉమ్మడి జిల్లాలో ఆయా డిపోల నుంచి 339 అదనపు బస్సులను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా నడుపుతున్నారు. హైదరాబాద్లో ఎల్బీనగర్, హయత్నగర్, ఉప్పల్, సాగర్ రింగ్ రోడ్డు నుంచి ఆయా ప్రాంతాలకు సరిపడా బస్సులను నడుపుతున్నారు. దాంతో ప్రయాణికులు ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు వెళ్తున్నారు.
సెలవుల ప్రకటనతో విద్యార్థులు ఇంటిబాట..
ఉమ్మడి జిల్లాకు ఉన్నత విద్యా నిలయమైన నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి ఇప్పటికే సెలవులు ప్రకటించింది. అదేవిధంగా శుక్రవారం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో గురువారమే విద్యార్థులు ఇంటిబాట పట్టారు. కొందరు శుక్రవారం తమ గ్రామాలకు వెళ్లనున్నారు. పండుగ కోసం ఊర్లకు వెళ్లే ప్రయాణికులతోపాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో బస్టాండ్లలో రద్దీ కనిపించింది.