ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరిగిన అడ్మిషన్లు
ప్రైవేట్ నుంచి వలసల వెల్లువ
నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 5,960 మంది చేరిక
మన ఊరు-మన బడితో సర్కారు స్కూళ్లకు పూర్వ వైభవం
రామగిరి, జూలై 4 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. జూన్ 3నుంచి 30వరకు నిర్వహించిన బడిబాటలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యం చేయడంతో సర్కారు బడికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14,783మంది విద్యార్థులు కొత్తగా చేరినట్లు విద్యాశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి.
బడిబాటతో పెరిగిన అడ్మిషన్లు…
మన ఊరు-మనబడి పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్, ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతుండటంతో కొత్త అడ్మిషన్లు పెరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసే ఆంగ్లమాధ్యమం, మౌలిక వసతులపై వివరించారు. దీంతో వారిలో సర్కారు బడిపై విశ్వాసం పెరిగి ప్రైవేట్ బడుల్లో చదివే తమ పిల్లలను స్థానిక పాఠశాలల్లో చేర్పించారు. అంగన్వాడీల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నవారు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమి, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేరారు. జూన్ 30తో ముగిసిన బడిబాటలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 14,783 మంది విద్యార్థులు చేరారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 5,960 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో అడ్మిషన్ పొందారు.
మన ఊరు-మనబడితో అభివృద్ధి
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మన ఊరు-మనబడి, మన బస్తీ -మనబడి కార్యక్రమాలు ఎంతో దోహదం చేశాయి. దీంతో పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అందుబాటులోకి రాగా మరో వైపు మౌలిక వసతులు సమకూరాయి. ప్రైవేట్కు దీటుగా రాణించేలా విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ అందించడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో డిజిటల్ పాఠాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన నమ్మకం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మన ఊరు-మనబడి, మనబస్తీ- మనబడి కార్యక్రమాలతో సర్కారు బడిపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. బడిబాటలో ఇంటింటికీ తిరిగి విద్యాధికారులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో వారిలో చైత్యనం పెరిగి తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాం ఇస్తున్నాం. ప్రతి విద్యార్థిపై శ్రద్ధ చూపుతూ నాణ్యమైన విద్య అందిస్తుండడంతో బడిబాటలో అత్యధిక అడ్మిషన్లు వచ్చాయి. నల్లగొండ జిల్లాలో 5,960 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. ఇది అందరి సహకారంతోనే సాధ్యమైంది.
– బి.భిక్షపతి, నల్లగొండ డీఈఓ