నల్లగొండ,జూన్ 16 : జిల్లాలో డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో పౌర సరపరాల డి.టి.లు పెట్రోల్ బంక్ డీలర్లు,సేల్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బంక్ లలో డీజిల్ కొరత నేపథ్యంలో వినియోగదారులకు డీజిల్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. డీజిల్ కొరత పై బంక్ ల వారీగా తహసీల్దార్లు, పౌర సరపరాల డీటీలు పర్యవేక్షణ చేయాలన్నారు.
డీలర్లు కోటా ప్రకారం సేల్స్ ఆఫీసర్ ద్వారా సరఫరా తెప్పించు కోవాలని,సేల్స్ అధికారులు డీలర్లు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం డీజిల్ ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా చేయాలని ఆదేశించారు. ఏమర్జెన్సీ సర్వీస్ లకు కొరత లేకుండా చూడాలన్నారు.
మూసి వేసిన బంకులు వెంటనే తెరచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.